Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతికత బదలాయింపునకు అమెరికా రక్షణ కంపెనీలు నో
- ఇక్కడ తయారయ్యే పరికరాలకు బాధ్యత వహించం:యూఎస్ఐబీసీ
న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలు దృఢమైన హామీలను కోరుతున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసే రక్షణ పరికరాల సాంకేతికతపై తమ కంపెనీలకే నియంత్రణ ఉంటుందని లాబీయింగ్ సంస్థ యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) భారత రక్షణశాఖకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. భారత్లోని స్థానిక కంపెనీల భాగస్వామ్యంతో తయారయ్యే పరికరాల లోపాలకు తాము బాధ్యత వహించమని కూడా యూఎస్ఐబీసీ తన లేఖలో తెలిపింది. భారత సైన్యానికి యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ సంస్థలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ భారత వాయుసేనకుసేవలందించిన సోవియట్ కాలంనాటి వందలాది రష్యా మిగ్ విమానాలకు కాలం తీరడంతో వాటి స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలని రక్షణశాఖ నిర్ణయించింది. దేశీయంగా తయారు చేయాలన్న మూడు దశాబ్దాల ప్రయత్నం వాయిదా పడుతూ వస్తున్నది. భారత్ కనీసం 100 ఇంజిన్లకు ఆర్డర్ ఇస్తే ఎఫ్-16 రకం యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి లాక్హీడ్ సుముఖత వ్యక్తం చేసింది. భారత రక్షణశాఖ నూతన వ్యూహాత్మక భాగస్వామ్యంలో లాక్హీడ్తో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వీటిని ఉత్పత్తి చేయనున్నది. అమెరికా కంపెనీ 49 శాతానికే పరిమితం కానుండగా, భారత కంపెనీ మెజారిటీ వాటాలు 51 శాతం కలిగి ఉండనున్నది. అయితే,రక్షణ పరికరాలను సంయుక్త భాగస్వామ్యంలో తయారు చేసినప్పటికీ అందుకు సంబంధించిన సాంకేతికత భారత కంపెనీకి బదిలీ కాదనేది యూఎస్ఐబీసీ లెటర్ సారాంశం.
ప్రభుత్వ,ప్రయివేట్ రక్షణ భాగస్వామ్యంలో పాల్గొనే తమ కంపెనీల విషయంలో సాంకేతికతపై యాజమాన్య నియంత్రణ అనేది ప్రధానాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆగస్టు 3న భారత రక్షణశాఖకు రాసిన లేఖలో యూఎస్ఐబీసీ పేర్కొన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. (సఅ జూశీర్.షశీఎ సౌజన్యంతో)