Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యాక్సీ మీటర్ తరహాలో ఫీజులు
- కోర్టుల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వండి: లా కమిషన్ చైర్మెన్ బిఎస్ చౌహాన్
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థలో న్యాయం పొందడం ఎంతో సంక్లిష్టమైనది, ఖర్చుతో కూడుకున్నదని లా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ న్యాయమూర్తి బిఎస్ చౌహాన్ అన్నారు. పేదలకు అది అందకుండా ఉన్నదని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జినైన తాను కూడా ఏదైనా కేసు విషయంలో పెద్ద న్యాయవాదులు డిమాండ్ చేసే ఖర్చు భరించలేనని చౌహాన్ స్పష్టం చేశారు. మన న్యాయ వ్యవస్థలో బెయిల్ షరతులు సంక్లిష్టంగా ఉన్నాయని, పేదవాళ్లు తమ జీవితకాలమంతా కోర్టుల దగ్గర వేచి చూస్తుండగా.. ధనవంతులు అరెస్ట్ కాకుండానే బెయిల్ పొందుతున్నారని చౌహాన్ అన్నారు. బెయిల్ విషయంలో పేదలు, ధనికుల మధ్య వివక్షను చౌహాన్ గుర్తు చేశారు. పెద్ద న్యాయవాదులు ఎంత పెద్ద నేరానికి సంబంధించిన కేసులోనైనా తమ క్లయింట్కు బెయిల్ ఇప్పించగలరని..అయితే, వారు గంటలు, రోజుల చొప్పున ఫీజు వసూలు చేస్తూ ట్యాక్సీవాలాల్లా వ్యవహరిస్తున్నారని చౌహాన్ విమర్శించారు. స్థానిక కోర్టుల్లో పేద ప్రజలకు అర్థంకాని ఇంగ్లీష్కు బదులు స్థానిక భాషల్లో వాదనలు జరిగేలా మార్పు చేయాలని ఆయన సూచించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచినా కోర్టుల్లో ఉపయోగించే భాషను మార్చుకోకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తీహార్ జైళ్లు, బ్యూరో ఆఫ్ సోషల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్వర్క్, మానవ హక్కుల సంస్థ సీహెచ్ఆర్ఐ సంయుక్తంగా నిర్వహించిన సెమినార్లో ప్రసంగిస్తూ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సెమినార్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా, సీహెచ్ఆర్ఐ డైరెక్టర్ సంజరు హజారికా, ఢిల్లీ జైళ్ల డైరెక్టర్ జనరల్ కూడా ప్రసంగించారు. ఈ సెమినార్లో తీర్మానించే సూచనలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమని మనీశ్సిసోడియా హామీ ఇచ్చారు.