Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిగ్రీ ఉత్తీర్ణుల్లో వారే అధికం
- ఉన్నత విద్యలో రాణిస్తున్న అమ్మాయిలు
- ఉద్యోగాలు, కీలక పదవుల్లో మాత్రం అతి తక్కువ భాగస్వామ్యం
- మొత్తం ఉద్యోగుల్లో 27 శాతం
- పార్లమెంట్లో 11 శాతం, అసెంబ్లీల్లో 8.8 శాతం మాత్రమే
న్యూఢిల్లీ:విద్యార్థుల జనాభా భాగస్వామ్యంలో బాలురను బాలికలు అధిగమించనున్నారు. భారత్లో అది త్వరలోనే జరగనున్నది. తాజా గణాంకాలు అందుకు సంకేతాలిస్తున్నాయి. 2014-15 విద్యా సంవత్సరంలో దేశంలో మొత్తం 30 కోట్లమంది విద్యార్థులుండగా, వీరిలో బాలికలు 48 శాతం. గత కొన్నేండ్లుగా పాఠశాలల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు బాలికల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ ఉన్నది. 1950-51 ఏడాదిలో విద్యార్థుల్లో కేవలం 25 శాతం మాత్రమే బాలికల వాటా. ఆ తర్వాత 40 ఏండ్లలో బాలికల సంఖ్య నెమ్మదిగానే పెరిగి 1990-91కి 39 శాతానికి చేరుకున్నది. ఆ తర్వాత మరో పదేండ్లకు 42 శాతానికి పెరిగింది. 2000-01 తర్వాత బాలికల భాగస్వామ్యం సగానికి దగ్గరవుతున్నది. అంతేకాకుండా డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో బాలురకన్నా బాలికలే అధికంగా ఉంటున్నారు.
భారత్లో వచ్చిన ఈ మార్పు త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చనున్నది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఉన్నత విద్యావంతుల్లో మహిళలు 54 శాతంగా ఉన్నారు. అమెరికాలో 55 శాతం, చైనాలో 54 శాతం ఉన్నారు. అయితే, ఈ దేశాల్లో విద్యతోపాటు సమాజంలోని పలు రంగాల్లో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. ఉద్యోగాలు, రాజకీయాలు, పరిపాలన, ఆర్థికరంగంలోని నిర్ణాయక విభాగాల్లో వారి విద్యకు తగిన భాగస్వామ్యం ఆ దేశాల్లో లభిస్తున్నది. భారత్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. వివిధ రంగాలలో మహిళల భాగస్వామ్యం వారి విద్యకు తగినంతగా లేదు. మహిళల మొత్తం భాగస్వామ్యం 27 శాతానికే పరిమితమైంది. పార్లమెంట్లో 11 శాతం, రాష్ట్రాల అసెంబ్లీల్లో 8.8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. 500 లిస్టెడ్ బడా కంపెనీల సీఈవోల్లో 17మంది మాత్రమే మహిళలు ఉన్నారు. విద్యావంతులైన మహిళల పట్ల వివక్షను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకంవంటివి పాఠశాలల్లో బాలికల శాతాన్ని పెంచాయి. 1990 తర్వాత బాలికల శాతం పెరిగేందుకు ఇటువంటి సంక్షేమ పథకాలు ఊతంగా నిలిచాయి. డిగ్రీలు పూర్తి చేస్తున్నవారిలో మహిళల సంఖ్య పెరుగుతుం డటంతో విశ్వవిద్యాలయాల స్థాయిలో వారి సంఖ్య త్వరలోనే పెరిగే అవకాశమున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో అది జరిగింది కూడా. సామాజిక శాస్త్రాల్లో ఇటీవల మహిళల సంఖ్య పెరుగుతున్నది. దాంతో, సైన్స్, కామర్స్వంటి వాటిలో వారి భాగస్వామ్యం తగ్గుతున్నది. వృత్తివిద్యా కోర్సుల్లో మాత్రం బాలురే అధికంగా ఉన్నారు. ఇంజినీరింగ్లో బాలురు, బాలికలు 3:1 నిష్పత్తిలో ఉన్నారు. వైద్య విద్యలో బాలికలే అధికం.