Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పగిలిన తలలు.. తేలిన వాతలు..
- అమ్మాయిలన్న కనికరం చూపలేదు: బీహెచ్యూ విద్యార్థినుల ఆవేదన
లక్నో: 'దేశంలో గో సంరక్షణపై అమితంగా శ్రద్ధ చూపిస్తున్న బీజేపీ సర్కారు.. అమ్మాయిల భద్రతపై మాత్రం ఎనలేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదు.. దేశ సౌభాగ్యమే తమకు ప్రధానమని మోడీ మాట్లాడుతున్నారు. కానీ, ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే పోలీసులు మాపై పాశవిక దాడి చేశారు. అమ్మాయిలమన్న కనికరం కూడా చూపకుండా ఇష్టమొచ్చి నట్టు చావబాదారు. ఆవులైతే ఇలాగే దాడి చేసేవారా?' అంటూ బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్యూ) విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో ఏం జరిగిందో తెలియలేదని, తెల్లారిన తర్వాత చూస్తే తలలు పగిలిపోయి ఉన్నాయని, శరీరాలపై వాతలు తేలాయని వాపోయారు. హాస్టల్లోకి ప్రవేశించిన పోలీసులు.. జుట్లు పట్టి లాగారని, పరుష పదజాలంతో దూషించారని తెలిపారు. మోడీ పర్యటన ముగియగానే లాఠీచార్జి చేయడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బీహెచ్యూలో గురువారం అర్ధరాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్ర, శనివారాల్లో ప్రధాని ఉత్తరప్రదేశ్లో పర్యటించినా వారి ఆందోళనను విరమిం చలేదు. కాగా మోడీ పర్యటన ముగియగానే విద్యార్థి నులపై మగ పోలీసులు శనివారం రాత్రి లాఠీచార్జి చేశారు. ఘటనలో విద్యార్థి నులతోపాటు పలువురు జర్నలిస్టులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ముందస్తు ప్రణాళికలో భాగంగానే విద్యుత్ను నిలిపివేసి, దొరికిన వారిని దొరికి నట్టు చావ బాదారని, రబ్బరు బుల్లెట్లు సైతం ప్రయోగించారని విద్యార్థినులు వాపోయారు. బీజేపీ సర్కారు అండతోనే పోలీసులు రెచ్చిపోయారని తెలిపారు. రెండు రోజులుగా నిరసన చేస్తుంటే ఆడ పోలీసులను విధుల్లో పెట్టేది పోయి.. మగ పోలీసులు, జవాన్లను ఎందుకు రంగంలోకి దించారని యూపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు లాఠీచార్జి ఘటనపై రిపోర్టు సమర్పించాల్సిందిగా వార ణాసి డివిజనల్ కమిషనర్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఆదేశిం చారు. జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ పలువురు మీడియా ప్రతినిధులు. సీఎం నివాసానికి సమీపంలో ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేటుకు ఓ మెమోరాండం సమర్పించారు. ఘటన నేపథ్యంలో విద్యార్థులకు సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు వర్సిటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. వాస్తవానికి దసరా సెలవులు ఈ నెల 28 నుంచి ఇవ్వాల్సి ఉన్నది.
చర్చించాల్సింది పోయి.. దాడి చేస్తారా ?: అఖిలేశ్
విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండించారు. సమస్యలపై చర్చలు జరిపి పరిష్కరించాలని, కానీ లాఠీచార్జి చేయడం సరికాదని ఆయన ట్విట్టర్లో ఆదివారం పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్యను జేడీ(యూ) సీనియర్ నేత శరద్ యాదవ్ తప్పుబట్టారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని ఆయన అన్నారు. 'బేటీ బచావో.. బేటీ పడావో' అని నినదిస్తున్న బీజేపీ.. అమ్మాయిలపై మగ పోలీసులతో దాడి చేయించడమేంటని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ విమర్శించారు. లాఠీచార్జి చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
నిరసన మొదలైందిలా..
బీహెచ్యూలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్టల్కు తిరిగి వస్తున్నది. కాగా.. వర్సిటీలోని కళాభవన్ వద్ద ఆమెను ముగ్గురు ఆకతాయిలు వేధించడం ప్రారంభించారు. బైకుపై వచ్చిన వారు.. ఆమెను తాకరాని చోట తాకుతూ.. పరుష పదజాలంతో దూషించారు.
వారి వేధింపులను విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ దుర్మార్గులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. వర్సిటీ సెక్యూరిటీ గార్డులు తనకు అతి సమీపంలోనే ఉన్నారని, సాయం కోసం అరిచినా వారు పట్టించుకోలేదని, ఆకతాయిలను నిలువరించే ప్రయత్నం చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపుల విషయమై వార్డెన్, చీఫ్ ప్రోక్టర్లకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఆమెకు ఊహించని షాక్ తగింది.. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేది పోయి.. ఆలస్యంగా హాస్టల్కు ఎందుకొస్తున్నావంటూ వారు.. ఆమెను తిట్టారు. దీంతో వర్సిటీలో అమ్మాయిలకు భద్రత కరువైందని, వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.