Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల ఫలితం..
- అవాంతరాలతో వృద్ధిరేటులో క్షీణత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అనుసరించిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కాళ్లూ, చేతులూ పడిపోయాయన్న నినాదంతో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం..ఈ మూడేండ్ల కాలంలో తీసుకున్న చర్యలు రోగమొకటైతే మందొకటి అన్న సామెతను గుర్తు చేస్తున్నాయి. దాంతో, రోగం మరింత వికటించినట్టయింది. ఈ ఆర్థిక సంవత్సరం(2017-18) మొదటి త్రైమాసికం ఫలితాలను చూస్తే ఎవరికైనా అర్థమయ్యేది అదే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేట్ 5.7 శాతానికి పడిపోయింది. ఇది మూడేండ్ల కనిష్టమన్నది గమనార్హం. ఇదే సమయంలో జీడీపీ కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) 2.4 శాతంగా నమోదైంది. ఓవైపు చమురు ధరల్ని పెంచడం ద్వారా(ప్రపంచ విపణిలో ముడి చమురు ధరలు భారీగా తగ్గిన సమయంలో అధిక పన్నుల ద్వారా పెట్రోల్ ధరలు పెంచిన విషయం తెలిసిందే)ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరినప్పటికీ జీడీపీ వృద్ధి పడిపోవడాన్ని నివారించలేకపోయారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు వల్ల పెట్టుబడులు బలహీనడ్డాయి. ప్రయివేట్ వినియోగం క్షీణించింది. ఇటీవల ఎగుమతులు కొంత పెరిగినా, దీర్ఘకాలం కొనసాగే అవకాశంలేదు. రూపాయి విలువ పెరగడంతో ఎగుమతిదారులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దేశాన్ని ఒకే పన్ను విధానంలోకి తెచ్చిన జీఎస్టీ అమలు సంక్లిష్టంగా మారడం కూడా వృద్ధిరేట్పై వ్యతిరేక ప్రభావం చూపనున్నది.
పొరపాటు ఎక్కడ..?
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో మొదలైంది. యూపీఏ హయాంలో 2004-2012 కాలంలో వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి రేట్ నమోదైంది. వ్యవసాయ ఉత్పత్తులు ఏటా 3 శాతంమేర పెరుగుతూ ఈ రంగంలో 7.5 శాతం వృద్ధిరేట్ను నమోదు చేసింది. గ్రామీణ పేదల ఆదాయాలు పెరిగాయి. అదే సమయంలో ద్రవ్బోల్బణం కూడా పెరిగింది. అయితే, యూపీఏ-2 హయాంలో అధికార కాంగ్రెస్ను కుంభకోణాలు వెంటాడాయి. అవినీతి కుంభకోణాలకు తోడు చివరి ఏడాది 2013-14లో అనుసరించిన విధానం ఆర్థిక వ్యవస్థను పక్షవాతస్థితికి నెట్టింది. ప్రపంచ మార్కెట్లో ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గాయి. దాంతో, ఎంపిక చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను(ఎంఎస్పీ)తగ్గించుకుంటూ రావడంతో 3.5 శాతానికి పడిపోయింది. అంతకుముందు ఎంఎస్పీ సరాసరిన 8 శాతం ఉండేది.
2014 తర్వాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎ న్ఆర్జీఈఎస్) అమలు తీరులో తీసుకొచ్చిన మార్పు వల్ల గ్రామీణ ఉద్యోగిత దెబ్బతిన్నది. ప్రతి కుటుంబంలో ఒకరికి ఏడాదిలో 100 రోజులు పని కల్పిండమనేది గతంలో డిమాండ్ మేరకు జరిగేది. మోడీ పాలనలో ఆ పథకాన్ని వనరుల ప్రాతిపదికగా మార్చారు. 2014 నుంచి వరుసగా రెండేండ్లపాటు కరువు పరిస్థితులు నెలకొనగా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అమలు చేయడంపై మోడీ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. గ్రామీణ వృద్ధిరేట్ మరింత క్షీణించేందుకు మోడీ అనుసరించిన ఈ విధానం కూడా కారణమైంది.
ఆ తర్వాత నోట్లరద్దు, జీఎస్టీని అమలులోకి తేవడంలాంటి చర్యలు అసంఘటిత రంగంతోపాటు సంఘటిత రంగాన్ని కూడా దెబ్బతీశాయని కేఎన్ పోస్ట్ విశ్లేషించింది.
చెలామణీలో ఉన్న 86 శాతం పెద్దనోట్లను రద్దు చేస్తూ గతేడాది నవంబర్ 8న తీసుకున్న నిర్ణయం వల్ల జీడీపీలో 40 శాతం వాటా ఉండే అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నగదు లావాదేవీలపైనే ఈ రంగం ఆధారపడి ఉన్నది. మార్కెట్ వ్యవస్థ దెబ్బతినడంతో రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుళ్లిపోయిన ఆహార పంటల్ని పెంటదిబ్బలపాలు చేసిన పరిస్థితి.
నోట్లరద్దు తర్వాత 8 నెలలకు జీఎస్టీని అమలులోకి తెచ్చే క్రమంలో మరో దెబ్బ తగిలింది. పాత నిల్వలను తగ్గించుకొని కొత్త విధానంలోకి డీలర్లు, కంపెనీలు మారుతున్న సంధికాలం. సరఫరా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకునే క్రమంలో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతానికి పడిపోవడం జరిగింది. వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ 2002లో 76 శాతం పడిపోగా, ప్రస్తుతం 48 శాతానికి దిగజారాయి. మరోవైపు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ-మొండి బకాయిలు) 2017,మార్చి 31 వరకల్లా రూ. 6 లక్షల 41 వేలకోట్లకు(పునరుద్ధరించినవి కాకుండా) చేరాయి. 2013, మార్చి, 31 వరకల్లా ఎన్పీఏ రూ.1 లక్షా 56 వేలకోట్లు.
పశువుల అమ్మకంపై ఆంక్షలు విధించడం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న సమయంలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల మాంసం వినియోగం పడిపోయింది.