Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్లరద్దు విఫల ప్రయోగం, ఇక ఆ అంశంపై నో కామెంట్స్ : యశ్వంత్సిన్హా
ముంబయి: లోక్శక్తి(ప్రజాశక్తి) ద్వారా రాజ్యశక్తిని ఎదిరించాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్సిన్హా పిలుపునిచ్చారు. రైతుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థ శేట్కారీ జాగరణ్ మంచ్ మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలాలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో యశ్వంత్సిన్హా ప్రసంగించారు. ఈ సందర్భంగా సోషలిస్ట్ నేత, కీ.శే. లోక్నాయక్్ జయప్రకాశ్నారాయణను యశ్వంత్సిన్హా గుర్తు చేస్తూ..అకోలా నుంచే లోక్శక్తి ఉద్యమాన్ని ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించగా, దానికి వ్యతిరేకంగా లోక్నాయక్ నేతృత్వంలో ప్రజాస్వామిక ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని దేశం ఎదుర్కొంటున్నదని యశ్వంత్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఇటీవల విడుదల చేసిన గణాంకాలే అందుకు నిదర్శనమని యశ్వంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఈ మధ్య ఓ గంటపాటు ఇచ్చిన తన ప్రసంగంలో భారత్ ప్రగతి పథంలో పయణిస్తున్నదంటూ కార్లు, మోటార్ బైకులు అధికంగా అమ్ముడుపోయాయన్నారు, అభివృద్ధి అంటే అదేనా..? అని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ యశ్వంత్ ప్రశ్నించారు. అమ్మకాలు పెరిగాయి, ఉత్పత్తి ఎక్కడ..? అని యశ్వంత్ అన్నారు. నోట్ల రద్దు విఫల ప్రయోగమని అందరూ గుర్తించినందున తానిక ఆ అంశం గురించి మాట్లాడనని యశ్వంత్ తెలిపారు.
తాము(బీజేపీ) ప్రతిపక్షంలో ఉన్నపుడు అప్పటి ప్రభుత్వాన్ని పన్ను ఉగ్రవాదం, రాజ్య దోపిడి అంటూ ఆరోపించాం. ప్రస్తుత పన్నుల విధానానికి చివరగా ఉగ్రవాదం అన్న పదం తప్ప మరొకటేమీ సరైందిగా తనకు తోచటంలేదని యశ్వంత్సిన్హా అన్నారు. జీఎస్టీ అంటే మంచి, సులభమైన పన్నుగా ఉండాలి. కానీ, అధికారంలో ఉన్నవాళ్లు దానిని చెడు, సంక్లిష్టమైన పన్నుగా తయారు చేశారని ఆయన అన్నారు. తాను జార్ఖండ్కు చెందినవాడినని గుర్తు చేసిన యశ్వంత్, గతంలో ఆ రాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదు, ఇటీవల అక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో తనకు అర్థంకావడంలేదని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను యశ్వంత్సిన్హా తీవ్రంగా తప్పు పడుతున్న విషయం తెలిసిందే. ప్రజల మనోభావాలనే తాను వ్యక్తం చేస్తున్నానని ఇటీవల ఓ పత్రికలో రాసిన వ్యాసంలోనూ యశ్వంత్ స్పష్టం చేశారు.