Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ : సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే అంటూ ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం 11 ఏండ్ల బాలికను కబళించింది. ఆధార్ కార్డుతో రేషన్కార్డును లింకు చేయలేదని రేషన్ డీలర్ కార్డును తొలగించాడు. అటు స్కూలుకు దసరా సెలవులు కావడంతో.. అక్కడ పెట్టే మధ్యాహ్న భోజనం కూడా దొరకలేదు. తినడానికి మెతుకు కూడా కరువై... ఆకలితో నరకయాతన అనుభవించి ఆ బాలిక. ఎనిమిది రోజులుగా పస్తులున్న ఆ చిన్నారి... చివరకు మృత్యు ఒడికి చేరింది. బుల్లెట్ రైళ్లతో దేశాన్ని బుల్లెట్ వేగంతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని చెబుతున్నది బీజేపీ. ఆ పార్టీ పాలిత రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
జార్ఖండ్ సిండెగా జిల్లాలో 11 ఏండ్ల బాలిక ఆకలితో అలమటించి.. ఇటీవల మృతిచెందింది. ఆధార్కార్డ్తో లింక్ చేయలేదన్న సాకుతో ఆ కుటుంబానికి చెందిన రేషన్ కార్డు ను కొద్ది నెలల క్రితం రద్దు చేశారు. ఆధార్ కార్డు రద్దయిన తర్వాత స్కూల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంతో సంతోషి కడుపు నింపుకునేది. దసరా సెలవుల కారణంగా ఆ బాలిక కు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా దొరకలేదు. అటు పని, ఇటు రేషన్ దొరక్క సంతోషి తల్లి బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడిపింది. ఇక ఆ పేద కుటుంబానికి పస్తులు తప్ప లేదు. ఆకలితో అలమటిస్తూ సెప్టెంబర్ 28న సంతోషి తుది శ్వాస విడిచింది. చనిపోవడానికి ముందు దాదాపు ఎనిమిది రోజులుగా ఆమె పస్తులతోనే ఉంది. ఆమె చనిపోవడానికి కారణం ఆకలేనని ఆహార హక్కు ప్రచార కార్యకర్తలు చెబుతున్నారు. సంతోషి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితో పాటు మరో పాప కూడా ఉంది. ఆ కుటుంబానికి భూమి లేదు, ఉద్యోగం లేదు, స్థిరమైన ఆదాయం వచ్చే మార్గమూ లేదు. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న ఆ కుటుంబానికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సబ్సిడీమీద ఇచ్చే రేషన్ కు ఆధారం. గత కొన్ని నెలలుగా ఉపాధి హామీ పనులు కూడా కరువయ్యాయి. అంత దీన స్థితిలోనూ సంతోషిని వాళ్లమ్మ స్కూలుకు పంపిస్తుండేది. తను పస్తులున్నా.. కనీసం తన బిడ్డకైనా పిడికెడు మెతుకులు దొరుకుతాయని.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాలను పొందాలంటే రేషన్కార్డును ఆధార్తో అనుసంధానించాలని, అలా చేసిన వారికే సరుకులు ఇవ్వా లని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. డీలర్ మాత్రం ఏం చేస్తాడు? ప్రభుత్వ ఉత్తర్వులను అమలుచేశాడు. వారి రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోవడంతో ఆరు నెలల క్రితం రేషన్ డీలర్ ఆ కుటుంబానికి రేషన్ నిలిపివేశాడు. బయోమెట్రిక్ ప్రామాణీకరణగల ఆధార్ కార్డును లింక్ చేయకపోవడంతో జార్ఖండ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల్లో అర్హులైన చాలా మందికి రేషన్ను ఇప్పటికే నిలిపివేసినట్టు ఇటీవలే ఓ వార్తా సంస్థ సర్వేలో వెల్లడైంది.
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్
ఫిబ్రవరిలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. నవంబరు నాటికి తమ రేషన్ కార్డులను ఎవరైతే ఆధార్తో లింక్ చేయరో వారి కార్డులను జాబితా నుంచి తొలగిస్తామని లతెహర్ జిల్లా అధి కారి సెప్టెంబరులో హెచ్చరికలు కూడా జారీచేశారు. 'ఎక్కు వ మందిని ఈ పథకం నుంచి తొలగించడమే దీనివెనుక నిగూడార్థం' అని ఆహార హక్కు ప్రచార కార్యకర్త ధీరజ్ విమర్శించారు. సంతోషి కుమారి మృతికి సంబంధించి నిజ నిర్థారణ దర్యాప్తు బృందంలో ఈయన కూడా సభ్యులు. కరీ మతి గ్రామంలో ఇలా చాలా కుటుంబాల రేషన్ కార్డులను ప్రజాపంపిణీ వ్యవస్థ జాబితా నుంచి తొలగించారు. కారణం వారి రేషన్ కార్డులు ఆధార్తో అనుసంధానించకపోవడం. సబ్సిడీ మీద ఆహార ధాన్యాలు అందించడం సహా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను తప్పనిసరి చేయొద్దంటూ అత్యున్నత న్యాయస్థానం 2013 నుంచి పదేపదే ఇస్తున్న ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడమేనని స్వచ్ఛంద కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఉపాధి పనులు లేవు
సంతోషి గ్రామం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను నిలిపివేశారు. సంతోషి తండ్రికి మతిస్థిమితం లేకపోవడం తో ఆమె తల్లి కుటుంబాన్ని నడిపిస్తోంది. పనికి వెళితే వారాకిని రూ. 80 నుంచి 90 వచ్చేవి. ఇటీవల ఆ పనులూ దొరకకపోవడంతో.. కుటుంబం పస్తులుంటోంది. సంతోషి కుమారిది ఆకలిచావు కాదని, జబ్బుపడి చనిపోయి ఉండొ చ్చు అని అధికారులు బుకాయిస్తున్నారు. ఆమెకు ఎలాంటి రోగం ఉన్నదని ఏ డాక్టరూ చెప్పలేదు అని హక్కుల కార్యకర్త నంద్ ప్రసాద్ చెప్పారు.
జార్ఖండ్లో ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది
''జార్ఖండ్లో చదువురాని పేదవారికి ఆధార్ లింకు చాలా పెద్ద సమస్యగా ఉంది. ప్రజలు ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటి కీ, వాటిని రేషన్ కార్డులతో అనుసంధానించలేకపోతున్నా రు. ఎందుకంటే ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు, వారికి చదువు రాదు. ఎలాగో తిప్పలు పడి నెట్ సెంటర్లకు వెళితే... సర్వ ర్లు పనిచేయవు. ఈ నెలలో చాలా రోజులు ఆ పోర్టల్ పనే చేయలేదు' అని ధీరజ్ కుమార్ చెప్పారు.
ఫుడ్ అండ్ సివిల్ సప్లరు కార్యదర్శి ఏం చెప్పారు?
సెప్టెంబరు 7న ఫుడ్ అండ్ సివిల్ సప్లరు రాష్ట్ర కార్య దర్శి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 100 శాతం రేషన్ కార్డులు అనుసంధానం జరిగిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ జాబితా నుంచి 11.6 లక్షల మంది కార్డుల ను తొలగించామన్నారు. అవన్నీ నకిలీవని చెప్పారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా..
ఈ విషయాన్ని స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ఆగస్టు 21న జనతా దర్బార్లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత సెప్టెంబరు 1న జిల్లా సరఫరా అధికారికి సంతోషి తల్లి కొయలి దేవి ఆధార్ కార్డును రేషన్ కార్డుతో జతచేసి ఫిర్యాదుచేశారు. ఆ కుటుంబానికి కొత్త కార్డు ఇవ్వాలని అభ్యర్థించారు. సంతోషి మృతిచెంది రెండు వారాలైనా... ఇంకా వారికి కొత్త రేషన్ కార్డు మంజూరు కాలేదు.