Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతిపై ప్రధాని డాంబికాలు
- జనరక్ష యాత్ర ఫ్లాప్ యాత్ర..
- పార్టీ కార్యాలయం ముందు ధర్నా అప్రజాస్వామికం: సీతారాం ఏచూరి
- బీజేపీ తీరుపై నేడు ఢిల్లీలో నిరసన
- జాతీయ మహాసభలకు 765 మంది ప్రతినిధులు
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
అవినీతిని ఉపేక్షించబోమంటూ అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ... బీజేపీ కుంభకోణాలపై దర్యా ప్తునకు ఆదేశించకుండా మౌనం వహిస్తున్నారని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఇటీవల వెలుగుచూసిన అమిత్షా కుమారుడు జరుషా కుంభకోణ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించా లని డిమాండ్ చేశారు. ఇక జనరక్ష యాత్ర పేరిట సీపీఐ(ఎం) కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా చేపట్టడం అప్రజాస్వామికం అని ఏచూరి విమర్శించారు. ఆ పార్టీ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. యూపీఏ అవలంబించిన నయా సరళీకరణ ఆర్థిక విధానాలను బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా అమలుచేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ రాజకీయ పంథాపై విభేదాలు వచ్చినట్టు మీడియా సృష్టించిన కథనమని స్పష్టం చేశారు. పార్టీ 22వ మహాసభల్లో చర్చించే రాజకీయ తీర్మాన ముసాయిదాను పొలిట్బ్యూరో రూపొందించనుందని చెప్పారు.
ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన కేంద్ర కమిటీ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు.
బీజేపీ ప్లాప్యాత్ర...
జనరక్ష యాత్ర పేరిట దేశవ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయాల ముందు బీజేపీ చేపట్టిన యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని సీతారాం ఏచూరి వివరించారు. బీజేపీకి ప్రజల నుంచి స్పందన కరువైందని, అందువల్లే అమిత్షా తన యాత్రను మధ్యలో ఆపేసుకుని కేరళ నుంచి తిరిగివచ్చారని అన్నారు. 'గుర్తింపు పొందిన ఓ జాతీయ పార్టీ(సీపీఐ(ఎం)) కార్యాలయం ముందు 14 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం అప్రజాస్వామికం. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన కేంద్రమంత్రులు ఈ ఆందోళనకార్యక్రమాలకు నేతృత్వం వహించడం శోచనీయం' అని ఏచూరి అన్నారు. 'కేరళలోనూ ఈ యాత్ర బీజేపీకి ప్రతికూల ప్రభావం చూపింది. ఆ రాష్ట్రంలోని వెంగర అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నాల్గో స్థానానికి దిగజారింది' అని ఏచూరి విమర్శించారు.
కుంభకోణాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి
కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెలుగుచూసిన వ్యాపం స్కాం, బీహార్ భూకుంభ కోణం, పనామా పేపర్లు, సహారా-బిర్లా డైరీలు, లలిత్మోడీ కుంభకోణాలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని ఏచూరి డిమాండ్ చేశారు. 'అవినీతిని ఉపేక్షించబోమని 2014 ఎన్నికల్లో మోడీ ఢాంబికాలు పలికారు. కానీ ఈ మూడున్నరేండ్లలో వెలుగుచూసిన ఏ కుంభకోణంపై విచారణకు ఆదేశించలేదు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కుమారుడు జరుషా కుంభకోణం వెలుగుచూసింది. జరుషాను కాపాడేందుకు ఏకంగా కేంద్రమంత్రులను రంగంలోకి దించారు. అవినీతిపై ప్రధాని నరేంద్రమోడీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు' అని విమర్శించారు. ఒకవేళ అవినీతిపై నిజాయితీగా చర్యలు చేపడుతున్నట్టయితే ఈ కుంభకోణాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పి రాజకీయ ఆయుధంగా వాడకుండా ఈ కుంభకోణాలపై విచారణ జరిపించాలన్నారు.
ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత ప్రయివేటు సైన్యం నిషేధించాలి...
గోరక్షక ముఠాలతో పాటు యాంటీ రోమియోస్వ్కాడ్ తదితర ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత ప్రయివేటు సైన్యాన్ని నిషేధించాలని ఏచూరి డిమాండ్ చేశారు. ఇందుకోసం జాతీయస్థాయిలో ఓ చట్టం చేయాలన్నారు. గోమాంసం తింటున్నారని ఆరోపణలు సృష్టిస్తూ మైనార్టీలపై, దళితులపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించాల్సిన బీజేపీ ప్రభుత్వాలు... గౌరవ మర్యాదలతో ఉద్యోగాలు ఇస్తున్నాయని విస్మయం వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా యూపీలోని అఖ్లాక్ను కొట్టిచంపిన దుండగులకు ఎన్టీపీసీలో కొలువులు ఇచ్చిన ఉదాంతాన్ని వివరించారు.
ప్రజలపై ఆర్థిక భారాలు...
దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాటు ప్రజలపై భారాలు మోపడంపై కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని ఏచూరి వివరించారు. నోట్లరద్దు వైఫల్యం, జీఎస్టీతో ప్రజల ఇక్కట్లు పెరిగాయన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరగడం వ్యవసాయ సంక్షోభాన్ని తెలియజేస్తోందని చెప్పారు. 'ప్రతి యేడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామ న్నారు. కానీ ఐటీతో పాటు సేవరంగంలోనూ ఉపాధి సన్నగిల్లింది' అని వివరించారు. 'నరేంద్రమోడీ దేశంలోకి దిగుమతులు పెంచుతూ.. విదేశాల్లో ఉపాధి పెంచుతున్నారు' అని ఎద్దేవా చేశారు. 'ప్రజలు నేడు ఏ స్థితికి వచ్చారంటే... మంచిరోజులు వద్దు.. బీజేపీ అధికారంలోకి రాకముందున్న చెడు రోజులే తిరిగి ఇవ్వండి అని కోరుకునే పరిస్థితి వచ్చింది' అని అన్నారు.
ప్రజా ఉద్యమాలకు పూర్తి సంఘీభావం
దేశవ్యాప్తంగా బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ప్రజా పోరాటాలకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నట్టు ఏచూరి చెప్పారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల రైతాంగానికి కేంద్ర కమిటీ అభినందనలు తెలియజేసిందన్నారు. కనీస మద్దతు ధరకు రైతుల పంటలు కొనుగోలు చేసేలా చట్టం చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
త్వరలో రాజకీయ తీర్మాన ముసాయిదా రూపకల్పన
హైదరాబాద్లో వచ్చే యేడాది ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరగనున్న పార్టీ మహాసభల్లో చర్చించనున్న రాజకీయ తీర్మాన ముసాయిదా రూపకల్పన బాధ్యతను కేంద్ర కమిటీ పొలిట్బ్యూరోకు అప్పగించినట్టు ఏచూరి తెలిపారు. ఈ ముసాయి దాను పార్టీ మహాసభలు జరిగే రెండు నెలల ముందు అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రజాక్షేత్రంలో విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఈ మహాసభల్లో మొత్తం 765 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రాజకీయ పంథాపై పార్టీలో విభేదాలు మీడియా సృష్టి అని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 'బీజేపీ మతోన్మా దానికి వ్యతిరేకంగా లౌకిక, అభ్యుదయ, ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటాలు చేయడం అంటే... ఎన్నికల పొత్తు ఏర్పాటు చేసుకున్నట్టు కాదు' అని స్పష్టం చేశారు. ప్రస్తుత దశలో వామపక్ష కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ పోరాటాలు ఉండనున్నాయని మరోసారి పునరుద్ఘాటించారు.
తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై ఆలోచన లేదు...
తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులపై ఇప్పుడేమీ ఆలోచన లేదని ఏచూరి ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన...
బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు, కేరళలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాల్పడుతున్న హింసకు వ్యతిరేక ంగా నేడు(మంగళవారం) ఢిల్లీలోని అశోకారోడ్డులో నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని ఏచూరి తెలిపారు.