Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైకిల్కు టాటా.. చేతిలో చెయ్యి!
- త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం
- నవంబర్ 9న జరిగే సభ ముహుర్తం!
- మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వచ్చే నెల 9వ తేదీన టీపీసీసీ నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలిసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్గాంధీని రేవంత్రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2019లో తెలంగాణలో టీఆర్ఎస్తో టీడీపీ జత కట్టాలని పార్టీ నేతల నుంచి వస్తున్న ప్రకటనలు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాటిని ఖండించకపోవడంతో రేవంత్రెడ్డి కొంత మనస్తాపానికి గురయ్యారని తెలిసింది. కాంగ్రెస్పార్టీలో చేరుతారని సోమవారం వార్తలొచ్చాయి. ఆ వార్తలొచ్చిన మరుసటి రోజు అనుహ్యంగా రేవంత్రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో సమావేశ మయ్యారు. ఈ అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా వద్ద ప్రస్తావించగా.. రేవంత్రెడ్డితో పాటు తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. పునర్విభజన చట్టం ప్రకారం సీట్ల పెంపు జరగకపోతే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని అన్నారు. ఇక రేవంత్రెడ్డిని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలోకి చేర్చుకోవాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వచ్చే నెల 9వ తేదీన బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. అయితే ఆ తేదీని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ సభకు రాహుల్గాంధీతో పాటు పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈ బహిరంగ సభలో రేవంత్రెడ్డితో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని పార్టీ నేతలు అంటున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కాంగ్రెస్లో చేరుతారని చెబుతున్నారు.