Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పద్మావతి' నిరసనలపై ఏచూరి
కోల్కతా : బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'పై నిరసనలు అసహనానికి సంకేతమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సంజరు లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి' చిత్రం డిసెంబర్ 1 న విడుదల కానున్న విషయం తెలిసిందే. 'ఒక సినిమాకు వ్యతిరేకంగా నిరసనలకు దిగడం చాలా సిగ్గుచేటు. సినిమాలో ఏముందో ఎవరికీ తెలియదు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ కూడా ఇంకా ఇవ్వలేదు. ట్రైలర్ కూడా ఇంకా విడుదల చేయనేలేదు. ఆ సినిమాను నిషేధించాలంటూ నిరసనలను చూస్తున్నాం' అని ఏచూరి అన్నారు. 'సినిమాను నిషేధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఏది చరిత్రో? ఏది కాదో? నిర్ణయించేందుకు వాళ్లెవరు? ఇది అసహనానికి సంకేతమే' అని చెప్పారు. నిరసనకారులను అడోల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీల వ్యక్తిగత సైన్యంతో పోల్చారు. 'నల్ల, గోధుమరంగు చొక్కాల యూనిఫాంలతో హిట్లర్, ముస్సోలినీ సొంత సైన్యాన్ని నడిపారు. ఈ ప్రయివేటు సైనికులు కూడా (నిరసనకారులు) ఆదేవిధంగా పనిచేస్తున్నారు' అని ఏచూరి ఆరోపించారు. ''ఈ దేశ ప్రజలు ఏం తినాలో? ఏం తినకూడదో? ఏం వేసుకోవాలో? నిర్దేశించబడుతున్నారు. ఈ గోరక్షకులు ఎవరు? వారు ప్రజలను చంపుతున్నారు. పోలీసులు మాత్రం దాడికి గురైనవారిపైనే కేసులు పెడుతున్నారు. ఇది నియంతృత్వానికి సంకేతం' అన్నారు. పద్మావతిలో ప్రధానపాత్ర పోషించిన బాలీవుడ్ నటి దీపికా పడుకొనేపై బెదిరింపులకు పాల్పడటాన్ని ఆయన తప్పుపట్టారు. 'దీపికా పడుకునే ముక్కు కోస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆమె తండ్రి నాకు తెలుసు. ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు. సినిమాను నిషేధించమని డిమాండ్ చేస్తున్నవారికంటే, సినిమా హాళ్లను ధ్వంసం చేస్తున్నవారికంటే... ఆయన దేశానికి కీర్తి, గౌరవాన్ని సంపాదించిపెట్టారు' అని ఏచూరి చెప్పారు.