Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక మాధ్యమంలో హల్ చేస్తున్న వీడియో
- ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త గోవింద్ పరమార్
అహ్మదాబాద్: గుజరాత్లో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమం వేదికగా ఓటర్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ మానవ హక్కుల సంఘం కార్యకర్త గోవింద్ పరమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమంలో ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా సర్క్యులేట్ అవుతున్న 75 సెకండ్ల వీడియో క్లిప్ను వెంటనే నిషేధించాలని గోవింద్ పరమార్ తన ఫిర్యాదులో కోరారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి బిబి స్వెయిన్ స్పందిస్తూ సామాజిక మాధ్యమంలో సర్క్యులేట్ అవుతున్న వీడియో మూలాలు నిర్ధారించేందుకు పోలీసు దర్యాప్తుకై ఆదేశించినట్లు చెప్పారు. వీడియో వృత్తి పరంగా ఉత్పత్తి చేయబడినదైనందన అదేమంత కష్టమైంది కాదని, వీడియోలో నటించిన నటులు ఎవరనేది ముఖ్యమని పరమార్ తెలిపారు. 'మీ ఓటు-మీ భద్రత'' అనే సందేశంతో వీడియో ముగుస్తుందని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. రెండు మతాల మధ్య భయాలను, అప నమ్మకాలను కలిగించే విధంగా వీడియో ఉందని చెప్పారు.
''గుజరాత్లో రాత్రి 7 గంటల తరువాత జరిగిన సంఘటన'' అంటూ ప్రారంభమైన వీడియోలో ఒక యువతి రోడ్డుపై వడివడిగా నడుచుకుంటూ ఇంటికి రావడం, ఇంటి వద్ద ఆమె తల్లిదండ్రులు ఆందోళనతో ఆమె కోసం ఎదురుచూస్తూ ఉండటం, ఆమె ఇంటికి రాగానే ఊరట చెందడం లాంటి దృశ్యాలు కనిపిస్తాయి. యువతి నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనుక 'అజాన్' (ముస్లింల ప్రార్థన) వినిపిస్తోంది. దీనిపై యువతి తల్లి మాట్లాడుతూ ఇది గుజరాతేనా అని ప్రశ్నిస్తుంది. దీనికి తండ్రి 22 ఏళ్ళ నాటి గుజరాత్ అంటాడు. వాళ్ళు తిరిగి వస్తే ఇదే పరిస్థితి కొనసాగుతోంది అంటాడు. యువతి దానికి సమాధానమిస్తూ విచారించాల్సిన అవసరం లేదని, మోడీ ఉండగా ఎవరూ రారని చెబుతుంది. వీడియో ఎవరు రూపొందించారనేది తెలియలేదు. వీడియోలో బిజెపినో, కాంగ్రెసో ప్రస్తావించలేదు. కాని రాష్ట్రంలో బిజెపి 22 సంవత్సరాలు పాలించింది. కాంగ్రెస్ 1995లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. శంకర్ సిన్హా వఘేలా బిజెపి నుంచి విడిపోయి రాష్ట్రీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు మద్దతు ఇచ్చింది.