Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబద్ధాలతో రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు : జగన్
కర్నూలు: 'మేమిచ్చిన రూ.2 వేల పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకంటే అదనంగా వెయ్యి పెంచి రూ.3 వేలు ఇస్తాం' అని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఏపీలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నేలో మొదలుపెట్టిన పాదయాత్ర గులాంనబీపేట, ఎల్లూరి కొత్తపేట మీదుగా బనగానపల్లె వరకు సాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రాగానే వాటన్నిటినీ తుంగలో తొక్కారన్నారు. రైతులను అప్పుల్లోకి నెట్టడం, అవినీతి, మద్యం అమ్మకాలలో నెంబర్వన్ చేశారని ఆరోపించారు. శనగ, మినుము, పత్తి, మిర్చి, వేరుశనగ ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావడం లేదన్నారు. బనగానపల్లెలో పండించే మామిడిపండుకూ గిట్టుబాటు ధర లేదన్నారు. రాయలసీమ ప్రాంతంలో కోస్తా మాటలు, కోస్తాలో రాయలసీమ మాటలు చంద్రబాబు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వైసిపి ఎజెండా అయిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టే ప్రమాదముందన్నారు. రూ.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ చేస్తామని చెప్పారు.