Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనల్లో నలుగురు మృతి..ఇద్దరు గల్లంతు
విజయవాడ: కార్తీక దీపోత్సవం, సముద్రస్నానం సందర్భంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో నలుగురు మృత్యువాత పడగా ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతయిన వారి జాడ రాత్రి పొద్దుపోయేవరకూ తెలియరాలేదు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, బాలిక ఉన్నారు. కార్తీక మాస వనభోజనాల కోసం గుంటూరులోని కొరిటిపాడు నుండి సుమారు 30 మంది ఆదివారం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం, రామాపురం సముద్రతీరానికి వచ్చారు. వీరిలో జ్యోతి(20), పార్వతి అనే ఇద్దరు యువతులు సముద్రంలో మునిగి వెంటనే వస్తామని నీళ్లలోకి వెళ్లారు. కొద్దిదూరం వెళ్లిన ఆ యువతులిద్దరూ ప్రమాదంలో పడ్డారని ఒడ్డునున్న యోగి, మౌలాలి గమనించి.. వారిని రక్షించేందుకు సముద్రపు నీళ్లలోకి వెళ్లారు. వీరు కూడా సముద్రపు అలల తాకిడికి ప్రమాదానికి గురవుతుండగా గమనించిన మిగిలిన వారు కేకలు వేశారు. సమీపంలో ఉన్న మత్య్సకారులు వారిని కాపాడేందుకు వెళ్లారు. జ్యోతి, పార్వతి, యోగి ముగ్గురినీ మత్య్సకారులు ఒడ్డుకు తీసుకొచ్చారు. మౌలాలి గల్లంతయ్యాడు. ఒడ్డుకు తీసుకొచ్చిన ముగ్గురినీ వెంటనే చీరాల వైద్యశాలకు తరలిం చారు. అయితే అప్పటికే జ్యోతి, యోగి మృతి చెంది ఉన్నారు. పార్వతి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ వైద్యశాల నుండి పట్టణంలోని ప్రవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో మృతి చెందిన జ్యోతి నాలుగు నెలల గర్భవతి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ఘటనలో అత్తాకోడళ్లులో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. మద్ది శేషారత్నం (56), మద్ది బ్రాహ్మణి (26) ఆదివారం తెల్లవారు జామున ఐదు గంటలకు కార్తీక దీపాలు కాల్వలో వదిలేందుకు బకింగ్హామ్ కాల్వ దగ్గరకు వెళ్లారు. ఇటీవలే అక్కడ రోడ్డు విస్తరణలో భాగంగా బట్టలు ఉతుక్కునేందుకు వీలుగా మెట్ల రేవును నిర్మించారు. ఆ రేవులోనే దీపాలు వదిలే క్రమంలో నీటి ఒరవడికి ఇద్దరూ కొట్టుకుపోయారు. తోటి మహిళలు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులొచ్చి మద్ది శేషారత్నం మృతదేహాన్ని వెలికితీశారు. బ్రాహ్మణి కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సాయంత్రం వరకు గాలించినా కనిపించలేదు. విజయవాడ రూరల్ మండలం మంగళాపురం వద్ద పోలవరం కాలువలో కార్తీక స్నానానికి వెళ్లిన తల్లీ కూతళ్లలో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన పన్నెండేళ్ల పాపపేరు శ్వేత. కాలువలో స్నానం చేస్తుండగా కాలుజారి వీరిద్దరూ కొట్టుకుపోతుండగా శ్వేత తల్లిని రక్షించగలిగారు. పాప మృత్యువాతపడింది.