Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకికవాదులంతా ఐక్యమవ్వాలి
- 'ఆవాజ్' సభలో బృందాకరత్
అనంతపురం: 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు కాదది.. రాష్ట్రీయ సర్వనాశక్ సంఫ్ు' అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. లౌకికశక్తులన్నీ ఏకమై మతోన్మాద శక్తుల పీచమణిచి వేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో 'మైనార్టీల హక్కుల సాధన' అంశంపై బహిరంగ సభ నిర్వహించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రసూల్ అధ్యక్షతన జరిగిన సభలో బృందాకరత్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు సావర్కర్ స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటీష్ పాలకులకు మోకరిల్లి విధేయుడిగా ఉంటానని లిఖితపూర్వకంగా ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి ఆయన అనుచరులు ఈ దేశ ప్రజల దేశభక్తిని శంకించే విధంగా మాట్లాడటం శోచనీయమన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక గోరక్షణ పేరుతో హింసాకాండ కొనసాగుతోందని అన్నారు. హక్లాక్, జునైద్, ఇంతియాజ్లను హతమార్చిన విషయం తెలిసిందేనని చెప్పారు. ఈ కేసుల్లో ఏ ఒక్క నిందితుడిపైనా ఇంత వరకు చర్యల్లేవని అన్నారు. పైగా బాధితులపైనే కేసులు నమోదవడం విచారకరమన్నారు. దేశంలో ముస్లింలు ఎస్సీ, ఎస్టీ దళితుల కంటే ఎంతో వెనుకబడి ఉన్నారని అనేక కమిషన్లు రిపోర్టులు ఇచ్చాయని గుర్తు చేశారు. కేరళ, కర్నాటక, తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఇక్కడ కూడా ఒత్తిడి పెంచి అమలు చేయించుకోవాల్సిన అవసరముందన్నారు. మహిళా బిల్లును ఆమోదింప చేయలేని నరేంద్రమోడీ ముస్లిం మహిళలకు అండగా ఉంటానని మాత్రం ప్రకటన చేస్తున్నారన్నారు. ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే చర్యలు తప్ప మరొకటి కాదన్నారు. వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామిక, లౌకికశక్తులన్నింటినీ కలుపుకుని పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి ఇమ్రాన్ ప్రతాప్గరి తన కవితల ద్వారా మతోన్మాద చర్యలను తూర్పారబట్టారు. తాజ్మహల్ కాదు.. తేజోమహల్ అంటూ బీజేపీి నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖలపైనా ఆయన స్పందించారు. జెఎన్యులో విద్యార్థి జునైద్ మాయమైతే తొలిసారిగా ఆందోళన చేపట్టిన వ్యక్తులు ముస్లిము యేతర విద్యార్థులేనని గుర్తుచేశారు. ఆవాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఏ.గఫూర్ మాట్లాడుతూ.. సచార్ కమిటీ, రంగనాథ్మిశ్రా కమిటీలు ముస్లిముల వెనుకబాటు తనంపై స్పష్టంగా చెప్పాయని గుర్తు చేశారు. విలువైన వక్ఫ్ ఆస్తులున్నాయని, అవి ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడిపెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆవాజ్ అధ్యక్షులు ముర్తుజా, ప్రధాన కార్యదర్శి ఎం.ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.