Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబినెట్ కార్యదర్శి వేతనం రూ.2.50 లక్షలు
- రాష్ట్రపతి వేతనం రూ.1.50 లక్షలు
- హోంశాఖ ప్రతిపాదన అమలైతే నెలకు రూ.5 లక్షలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి వేతనం కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత ఉద్యోగి వేతనం కన్నా అధికంగా ఉండటం ఆనవాయితీ. ప్రస్తుతం మాత్రం ఆ విధంగా లేదు. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు 2016, జనవరి 1 నుంచి ప్రభుత్వ అధికారుల వేతనాలు పెరిగాయి. అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగి క్యాబినెట్ కార్యదర్శి వేతనం నెలకు రూ.2 లక్షల 50 వేలు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వేతనం రూ.2 లక్షల 25 వేలు. ప్రస్తుతం రాష్ట్రపతి నెలసరి వేతనం రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం రూ.1.25 లక్షలు, గవర్నర్ల వేతనం రూ.1.10 లక్షలుగా ఉన్నది. వీరికి 2008 నుంచి ఈ వేతనాలు అమలవుతున్నాయి.
త్రివిధ దళాలకు రాష్ట్రపతి సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం మాత్రం త్రివిధ(ఆర్మీ, వైమానిక,నేవీ) దళాతిపతుల వేతనం కంటే కూడా తక్కువగా ఉన్నది. వీరి వేతనం క్యాబినెట్ కార్యదర్శి వేతనంతో సమానంగా ఉంటుంది. దీంతో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలను పెంచాలంటూ హోంశాఖ కేంద్ర మంత్రిమండలికి ఏడాది క్రితమే ప్రతిపాదనలను పంపినట్టు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం రూ.3.50 లక్షలకు, గవర్నర్ వేతనం రూ.3 లక్షలకు పెరగనున్నాయి.