Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలనుంచి దృష్టి మళ్లించేందుకు పద్మావతి సినిమాపై రాద్ధాంతం
- 'ఉపాధి' బకాయిలను తక్షణం చెల్లించాలి
- కనీస మద్దతు ధరతో వేరుశనగ కొనుగోళ్లు చేపట్టాలి: బృందాకరత్
అనంతపురం : 'బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో జూనియర్ భాగస్వామిగావున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో జరుగుతున్న మతోన్మాద దాడులు, తదితర అంశాలపై మౌనం వహించడం సరైంది కాదు' అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ విమర్శించారు. ఆదివారం అనంతపురం గణేనాయక్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోరక్షణ పేరుతో దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగానున్న చంద్రబాబు దీనిపై స్పందించకపోవడం విచారకరమని అన్నారు. పద్మావతి సినిమా విడుదల కాకముందే విమర్శలు చేసి, దాడి చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఇది వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే అవుతుందన్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టికి మళ్లించేందుకు ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన అనంతపురం జిల్లా ప్రజలకు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్నది జాతీయ ఉపాధి హామీ పథకమని తెలిపారు. దీనిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఉపాధి హామీ బిల్లులు ఇంతవరకూ ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. దీనిపైనా చంద్రబాబు నోరు మెదడపక పోవటం విచారకరమన్నారు. ఈ విషయంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మాత్రం ఢిల్లీలో ఆందోళన చేశారని గుర్తు చేశారు. కూలీలకు బకాయిపడ్డ వేతనాలను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలాఏండ్ల తర్వాత కొంత మేరకైనా ఈసారి అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట చేతికొచ్చిందన్నారు. ఆ పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం అందించలేకపోతోందని విమర్శించారు. పంట పండని సమయంలో క్వింటాలు రూ.7వేల ధర ఉంటే ఇప్పుడు రూ.3 వేలు కూడా లభించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరతోనైనా వేరుశనగ కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.