Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నూలు:సీఐటీయూ కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు గోరంట్ల సుబ్బయ్య సోమవారం (64) మృతి చెందాడు. 15 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బయ్యను వైద్యం కోసం హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు శరీరం సహకరించక పోవడంతో ఉదయం 5.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరాపురంలో జన్మించిన జి. సుబ్బయ్య 1972లో కర్నూలు నగరానికి వచ్చారు. మొదట కర్నూలులో ప్రయివేటు పాలడెయిరీలో పని చేశారు. ఆతరువాత 1978లో రాయలసీమ పేపర్మిల్లులో అప్రెంటీస్గా చేరారు. పేపర్ మిల్లులో పని చేస్తూ సీఐటీయూ పట్ల ఆకర్షితులయ్యారు. సీఐటీయూ అనుబంధ సంఘం స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులుగా చేరారు. పేపర్ మిల్లులో కార్మికుల సమస్యలపై రాజీలేని రీతిలో పోరాటాలు చేశారు. యాజమాన్యం హత్యాయత్నం లాంటి తీవ్రమైన అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపినా సుబ్బయ్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. దాదాపు 40 ఏళ్ల పాటు కార్మిక ఉద్యమంలో ఉంటూ నగరంలో సీపీఐ(ఎం)లో చురుకైన పాత్ర పోషించారు. ప్రజాశక్తి ఎడిషన్ కార్యాలయ నిర్మాణానికి ఆయన సహకరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్రెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్.రాధాకృష్ణ , ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నిర్మల తదితరులు పేర్కొన్నారు. సీఐటీయూ నాయకులు సుబ్బయ్య ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.