Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా స్థానికుల ఆందోళన
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడుమృతి చెందాడు. దీనిని నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాశ్మీర్లోని కుప్వారా జిల్లా థాండిపోరా గ్రామంలో ఆర్మీ పెట్రోలింగ్ బృందం శనివారం రాత్రి జరిపిన కాల్పుల్లో అసిఫ్ ఇక్బాల్ అనే వ్యక్తి చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. అయితే.. సైనికాధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. థాండిపోరాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు సైనికాధికారి రాజేశ్ కలియా తెలిపారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఎదురుకాల్పుల్లో భాగంగా క్రాస్ ఫైరింగ్ జరిగి పౌరుడు మృతి చెందినట్టు ఆయన తెలిపారు. భద్రతా బలగాల తీరును నిరసిస్తూ కుప్వారా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అందోళన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.