Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల వెటకారపు వ్యాఖ్యలు
- భారత్ను ఒంటరి చేసేందుకూ వెనకాడని తీరు
- డబ్ల్యూటీవో సదస్సులో బయటపడ్డ బడాయి దేశపు నిజ స్వరూపం
న్యూఢిల్లీ: అభివృద్ది చెందుతున్న దేశాల ఆహార సబ్సిడీ అంశం.. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) 11 వ ద్వైవార్షిక మంత్రులస్థాయి సమావేశాల్లో ప్రతిష్టంభనకు కారణమైంది. దాంతో, ఆ సమావేశాలు ఎలాంటి తీర్మా నాలు చేయకుండానే ముగిశాయి. అర్జెంటీనా రాజధాని బ్యూ నోస్ ఎయిర్స్లో ఈ నెల 10 నుంచి 13 వరకు డబ్ల్యూటీవో సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆహార సబ్సిడీలకు సంబంధించిన పీస్క్లాజ్(శాంతి నిబంధన) విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, పారిశ్రామిక దేశాలకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీల మొత్తం ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే పంటల విలువలో 10 శాతానికన్నా అధికంగా ఉండకూడదు. అయితే, 2013లో భారత్లో ఆహార భద్రతా చట్టం అమలులోకి రావడంతో దేశంలోని 75 శాతంమంది ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. దీంతో,2013లో బాలీలో జరిగిన సదస్సు సందర్భంగా నిబంధనను సవరించేందుకు భారత్ పట్టుపట్టింది. పర్యవసానంగా భారత్వంటి దేశాలకు అనుకూలంగా పీస్ క్లాజ్ను డబ్ల్యూటీవో చేర్చింది. దీని ప్రకారం 10 శాతాన్ని అధిగమించినా భారత్వంటి దేశాలపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సభ్య దేశాలకు హక్కు లేదు. అయితే, ఆ క్లాజ్ వల్ల కలిగే తాత్కాలిక ప్రయోజన ంకన్నా చట్టపరంగా శాశ్వత రక్షణ కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. దానికి అమెరికా అడ్డుకున్నది. చైనా, భారత్వంటి దేశాలను పేద దేశాలుగా ఎలా చెబుతామని అమెరికా వెటకార మాడింది. నిబంధనల నుంచి మినహాయింపుల కోసం ధనిక దేశాలు కూడా పేద దేశాలుగా చెప్పుకుంటున్నాయంటూ అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. వాణి జ్య నిబంధనలను ఉల్లంఘిస్తు న్నారంటూ చైనాను టార్గెట్ చేస్తూ యూరోపియన్ యూని యన్ దేశాలు, జపాన్తో కలిసి అమెరికా ప్రకటన చేసింది. అయితే, వ్యవసాయరంగ సబ్సిడీల విషయంలో పాశ్చాత్య దేశాలే వక్రీకరణలకు పాల్పడు తున్నాయిని భారత్, చైనా మండిపడ్డాయి. తమ జీడీపీ వృద్ధి రేట్ అధికంగానే ఉన్నప్పటికీ తమ దేశంలోని కోట్లాదిమందికి ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఆయా దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. డబ్ల్యూటీవో సమావేశాల సందర్భంగా ఇండియా పట్ల అమెరికా అవకాశవాద ధోరణి మరోసారి స్పష్టమైంది. తన ప్రయోజనాలకు అడ్డుగా భావిస్తే అంతర్జాతీయ వేదికల పై ఇండియాను ఒంటరి చేయడానికీ వెనకాడబోమని అమెరికా తన నైజాన్ని బయటపెట్టింది. సమావేశాలు ముగియకముందే అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్లైట్హైజర్ అక్కడి నుంచి నిష్క్రమించారు. భారత ప్రజల తలసరి జీడీపీ తక్కువేనన్నది అమెరికాకు తెలియని విషయమేమీ కాదన్నది గమనార్హం. అయితే, ఈ సమావేశాల్లో తమ ప్రధాన డిమాండ్లు నెరవేరకపోయినా ఆత్మరక్షణపరంగా పాక్షిక విజయం సాధించామని భారత్ భావిస్తోంది.