Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ నియామకంపై కేంద్రంతో రాష్ట్రం అమీతుమీ
అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంవాదానికి దారి తీసిన రాష్ట్ర నూతన డీజీపీ నియామక వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. రెండు ప్రభుత్వాలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పీటముడి వీడటం లేదు. రాష్ట్రం పంపిన జాబితాను రెండుసార్లూ వెనక్కి తిప్పి పంపడంతో కేంద్రంతో ఈ అంశంపై అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ యాక్ట్ను సవరించి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు వీలుగా రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమైన విషయాల్లో కేంద్రం తన పట్టును నిలుపుకొనేందుకే డీజీపీ జాబితాను తిప్పి పంపారని టీడీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ రేసులో ఉన్న ప్రస్తుత ఏసీబీ డిజి ఆర్పీ ఠాకూర్ కేంద్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి సాంబశివరావుకు మరోసారి అవకాశం లేకుండా చేశారని ఐపీఎస్ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై చంద్రబాబు కూడా ఆర్పీ ఠాకూర్పై ఆగ్రహంతో ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో పలువురు ఏసీబీ చీఫ్కే డీజీపీ పదవి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లూ సమాచారం. అయితే డీజీపీ నియామకం కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీయడంతో స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. చట్టాన్ని మార్చేశారు. ఇది ఆర్డినెన్స్గా మారితే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో సంబంధాలు లేకుండా డీజీపీని నియమించుకునే వెసులుబాటు లభిస్తుందంటున్నారు. నూతన డీజీపీ నియామకం ఆలస్యమయ్యే కొద్దీ కొత్తగా ఈ రేసులోకి మరికొందరు వస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి మాలకొండయ్య సహా జైళ్లశాఖ డీజీ వినరురంజన్రే, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్లతో పాటు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం.