Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెలో 30 వేల మంది మున్సిపల్ కార్మికులు
- రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు
- కార్మిక శక్తి ఏమిటో చూపుతాం : ప్రభుత్వానికి యూనియన్ నేతల హెచ్చరిక
విజయవాడ : కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, 279 జీఓ రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది మున్సిపల్ కార్మికులు సోమవారం సమ్మె ప్రారంభించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలకుగాను.. 98 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మున్సిపల్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. విధులను బహిష్కరించిన కార్మికులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణం లిఖితపూర్వకమైన హామీని ప్రకటించకపోతే కార్మిక శక్తి ఏమిటో చూపించాల్సి వస్తుందని విజయవాడలో యూనియన్ రాష్ట్ర నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో వేలాది మంది కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కార్మికులను వీధుల పాలు చేసే జీవోలతోపాటు నగర ప్రజలపై భారాలు మోపే విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయ సమ్మతమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఒంటరి కాదని, వారికి ఆయా ట్రేడ్ యూనియన్లకు చెందిన లక్షలాది మంది కార్మికులు అండగా నిలుస్తారని అన్నారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 110 మున్సిపాలిటీలకు 98 మునిసిపాలిటీల్లో సమ్మె జరుగుతోందన్నారు. 30 వేల మంది కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారని వివరించారు. 279 జీవో వల్ల ప్రమాదం ఏమీ లేదని మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు అంటున్నారని, అటువంటప్పుడు రద్దు చేయడానికి ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీఓ రూపంలో హామీ రాకపోతే మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొనేందుకు ఎఐటియుసి సిద్ధంగా ఉందన్నారు. జెఎసి సంఘాలను చర్చలకు పిలవకుండా కొద్దిమందితో మాత్రమే ప్రభుత్వం గోప్యంగా చర్చలు జరుపుతోందన్నారు. కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
శ్రీకాకుళం నగర పాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేశారు. జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీలు, రాజాం, పాలకొండ నగర పంచాయతీల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. విజయనగరం లో ధర్నా నిర్వహించారు. పార్వతీపురం, బొబ్బిలి మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. సాలూరులో అర్ధనగ ప్రదర్శన చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని జోన్లలో సీఐటీయూ ఆధ్వర్యాన సమ్మె చేపట్టారు. కార్మికులతోపాటు, కాంట్రాక్టు కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు 5,013 మంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు విఎస్సి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఇండిపెండెంట్), జీవీఎంసీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీి), ఎంసీవి ఎంప్లాయీస్ యూనియన్ (వైఎస్ఆర్టియు), ఎంఎంసీి ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ఎంఎస్) మద్దతు ఇచ్చాయి.
నర్సీపట్నంలో ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, పెద్దాపురంలో కార్మికులు విధులను బహిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో మున్సిపల్ అధికారులు పోటీ కార్మికులతో పని చేయించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. తాడేపల్లిగూడెంలో సమ్మె చేపట్టి ధర్నా చేశారు. మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. కొవ్వూరులో ధర్నాకు వివిధ కార్మిక, ప్రజాసంఘాల నేతలతోపాటు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ జె.రాధారాణి, వైస్ చైర్మన్ డి.రాజా రమేష్, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్ కార్మికుల ఆందోళన శిబిరం వద్దకు వచ్చి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీనిచ్చారు.
భీమవరంలో ధర్నా చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆందోళన నిర్వహించారు. కృష్ణాజిల్లాలోని బందరు, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాల్టీల్లో, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు నగర పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్లలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. గుంటూరులో విధులు బహిష్కరించిన కార్మికులు ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. ఒంగోలులో కార్మికులు బైటాయించారు. చీరాలలో ధర్నా నిర్వహించారు. అద్దంకి, కందుకూలలోనూ నిరసన తెలిపారు. కడప నగర పాలక సంస్థతో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ కార్యాలయాల ఎదుట కార్మికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట, చిత్తూరు కార్పొరేషన్లోనూ, మదనపల్లి, పలమనేరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లోనూ నిరసన తెలిపారు. అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ సమ్మె నిర్వహించారు. నంద్యాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.