Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసాభాసగా ముగిసిన పార్లమెంటరీ కమిటీ సమావేశం
- హాజరు కాని కమిటీ అధ్యక్షుడు
- ముసాయిదాపై 16 మంది అసమ్మతి
- ముగ్గురు సభ్యుల వాకౌట్
న్యూఢిల్లీ : ఎయిరిండియాలో పెట్టుబడుల ఉప సంహరణ ప్రతిపాదనకు పార్లమెంటరీ కమిటీ 'గండి' కొట్టింది. మంగళవారం ఇక్కడ సమావేశమైన రవాణా, పర్యాటకం, సంస్కృతి వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉప సంహరణకు సంబంధించిన వివాదాస్పద ముసాయిదా బిల్లును ఉపసంహరించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు నిరసన గళం విప్పారు. దీనికి సంబంధించి రూపొందించిన ముసాయిదా నివేదికను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు ప్రతిపక్ష నేతలు తమ నిరసనను తెలుపుతూ సమావేశం నుండి వాకౌట్ చేశారు. ఈ కమిటీ చైర్మెన్గా వున్న తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఓబ్రియన్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో బీజేపీ సభ్యుడు రాకేష్ సింగ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉప సంహరణకు ఇది తగిన సమయం కాదని, సంస్ధ పునరుద్ధరణకు కనీసం ఐదేళ్ళు గడువివ్వాలని కమిటీ పేర్కొంది. మొత్తం 31 మంది సభ్యులున్న ఈ కమిటీలో 16 మంది ముసాయిదా నివేదికను వ్యతిరేకిస్తూ లిఖితపూర్వకంగా తన అసమ్మతిని తెలిపారు. ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాలు అమ్మడానికి సానుకూలత వ్యక్తం చేసిన వారిలో అత్యధికులు అధికార బీజేపీ సభ్యులే కావడం విశేషం. నివేదిక ఉప సంహరణపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్కు చెందిన కుమారి షెల్జా, తృణమూల్కు చెందిన అర్పిత ఘోష్, రీటాబ్రాత బెనర్జీలు సమావేశాన్ని బహిష్కరించారు. తాత్కాలిక అధ్యక్షులు నియంతలా వ్యవహరిస్తున్నారని, పూర్తి స్థాయి అధ్యక్షునికి మాత్రమే నివేదికను ఉపసంహరించే అధికారం ఉందని అన్నారు. ఈ కమిటీలోని మొత్తం 31 మంది సభ్యులకుగాను 15 మంది బీజేపీకి చెందిన వారు కాగా, .కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్లకు చెందిన ముగ్గురేసి సభ్యులతోపాటు సీపీఐ(ఎం). టీడీపీ, అప్నా దళ్, ఆర్ఎల్ఎస్పీ, ఎస్పీ, వైఎస్సార్ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, బీజేడీ, ఏఐఏడీఎంకేలకు చెందిన ఒక్కొక్కరు సభ్యులుగా ఉన్నారు.