Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పద్మావత్' నిలిపివేస్తాం : హర్యానా
చండీగఢ్/రాట్లమ్ : సంజయ్ లీలా భన్సాలి ప్రతిష్టాత్మక 'పద్మావత్' సినిమాకు సెన్సార్బోర్డు గ్రీన్ సిగల్ ఇచ్చినా.. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అడ్డంకులు మాత్రం తొలగడంలేదు. ఒకదాని తర్వాత ఒకటి మా రాష్ట్రంలో సినిమాను విడుదల కానివ్వబోమని ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇది సినిమాను అడ్డుకుంటున్న బీజేపీ పాలిత ఆరో రాష్ట్రం కావడం గమనార్హం. పద్మావత్ను మా రాష్ట్రంలో నిషేధిస్తున్నామని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ ట్వీట్ చేశాడు. క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కొన్ని కత్తెరలు, పద్మావతిని పద్మావత్గా మార్చిన తర్వాత విడుదలకు సెన్సార్ బోర్డు అంగీకారం తెలిపిన తర్వాత ఇప్పటివరకూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్లు ఆయా రాష్ట్రాల్లో నిషేధం విధిస్తూ ప్రకటనలు చేశాయి.
పద్మావత్ పాటకు నృత్యం చేస్తున్న విద్యార్థులపై దాడి : పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా పద్మావత్ సినిమాలోని ఘూమర్ పాటకు నృత్యం చేస్తున్న వారిపై పలువురు దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. స్థానిక రాట్లామ్లో సెయింట్ పాల్స్ కాన్వెంట్ వార్షికోవంలో ఈ పాటకు పలువురు విద్యార్థులు నృత్యం చేస్తుండగా, భగత్ సింగ్ పీజీ కాలేజి విద్యార్థులు కొందరు రాజ్పుత్ కర్ణిసేన సభ్యులుగా చెప్పుకుంటూ సెయింట్ పాల్స్ కాన్వెంట్లోకి చొరబడ్డారు. నృత్యం చేస్తున్న విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, అడ్డువచ్చిన తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంపై కూడా దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కుర్చీలను, స్టేజీని, మ్యూజిక్ సిస్టమ్ను నాశనం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు.