Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజ్మహల్ను సందర్శించిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు
- పర్యటనను వ్యతిరేకించిన ముస్లిం మత పెద్దలు
న్యూఢిల్లీ/ఆగ్రా: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్లో పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తొమ్మిది అవగాహనా ఒప్పందాలపై(ఎంవోయూలు) సంతకాలు చేశాయి. ఇంధన (చమురు,గ్యాస్), రోదసి,రక్షణ, సైబర్ భద్రత, శాస్త్ర-సాంకేతిక సహకారంతోపాటు వ్యవసాయం, ఇతర రంగాలలో ఈ ఒప్పందాలు జరిగాయి. సోమవారం భారత్-ఇజ్రాయిల్ అధికారులు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్లో ఆరు రోజుల(ఈ నెల 14 నుంచి 19 వరకు) పర్యటన కోసం నెతన్యాహు ఆదివారమే భారత్ చేరుకున్నారు. ఆయన వెంట ఆ దేశానికి చెందిన 130మంది ప్రతినిధుల బృందం భారత్ చేరుకున్నది. వారిలో వివిధ రంగాలకు చెందిన అధికారులున్నారు. పదహేను సంవత్సరాల తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2003లో అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని ఏరియల్షెరాన్ భారత్లో పర్యటించారు. ఆ సమయంలోనూ కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి మంగళవారం తాజ్మహల్ను సందర్శించారు. తాజ్మహల్ను చూడటానికి ఆగ్రా వెళ్లిన నెతన్యాహు దంపతులకు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తన భార్య ముంతాజ్బేగమ్ పట్ల ప్రేమకు గుర్తుగా షాజహాన్ 17వ శతాబ్దంలో తాజ్మహల్ను నిర్మించారు. వీవీఐపీల రాకతో తాజ్ను చూడటానికి వచ్చిన సందర్శకులను రెండుగంటలపాటు అధికారులు అనుమతించలేదు. తాజ్మహల్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఆగ్రాలోని ముస్లిం మత పెద్దలు నెతన్యాహు పర్యటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజల పట్ల ఇజ్రాయిల్ సాగిస్తున్న జాత్యహంకార దాడులకు నిరసనగా తాము నెతన్యాహు పర్యటనను వ్యతిరేకిస్తున్నట్టు తంజీమ్ ఉలేమా-ఏ-అహల్-ఏ-సున్నాత్ అధ్యక్షుడు ముఫ్తీముదస్సార్ అలీఖాన్ ఖాద్రీ తెలిపారు. ఇజ్రాయిల్ను ముస్లింలకు శత్రువుగా ఆయన అభివర్ణించారు. పాలస్తీనీయులకు వారి సొంత గడ్డపైనే హక్కులు లేకుండా ఇజ్రాయిల్ అణచి వేస్తున్నదని ఆయన అన్నారు. ఆగ్రాలో ఇజ్రాయిల్ భాగస్వామ్యంతో యూపీ ప్రభుత్వం నిర్లవణీకరణ నీటి ప్లాంట్ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. రూ.14కోట్ల 42 లక్షల ఖర్చుతో మురికినీటిని శుద్ధి చేయడం కోసం ఈ ప్లాంట్ ఏర్పాటైంది. 2016లో ఆగ్రాలో పర్యటన సందర్భంగా ఇజ్రాయిల్ అధ్యక్షుడు రెవూవెన్ రెవ్లిన్ ఆ ప్లాంట్ను పరిశీలించారు. స్థానిక అధికారుల సూచన మేరకు నెతన్యాహు ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్లకుండానే ఆగ్రా నుంచి వెనుతిరిగారు.