Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళిక ప్రకారమే హత్య చేశారంటున్న లోయా స్నేహితుడు
- నిందితుడిగా ఉన్న అమిత్ షా కేసుకు.. దీనికి ఏదో సంబంధముంది..
ముంబయి : జస్టిస్ లోయా గుండెపోటుతో మరణించటం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనతోపాటు లా డిగ్రీ చదువుకున్న స్నేహితుడు ఉదరు గారే కూడా, ''లోయాది సహజ మరణం కాదు, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య''గా అనుమానిస్తున్నాడు. పలు ప్రజాసంఘాలు, ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరం, వివిధ రాజకీయ గ్రూపులు ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఉదరు గారే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లాతూర్ బార్ అసోసియేషన్ సభ్యుడిగా గారే న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ (మోడీ సర్కార్)...న్యాయవ్యవస్థలో కలుగజేసుకోవటం వల్లే జస్టిస్ లోయా చనిపోవడానికి దారితీసిందన్న అనుమానాన్ని ఉదరు గారే వ్యక్తం చేశారు. జస్టిస్ లోయా మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలే తన అనుమానాల్ని బలపర్చేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...''న్యాయవ్యవస్థ మేల్కోవాలి. లేదంటే దేశాన్నే అమ్మేస్తారు. జస్టిస్ లోయా, నేను ఇద్దరం మంచి మిత్రులం. ఒకేసారి లా డిగ్రీ పూర్తిచేశాం. న్యాయమూర్తిగా లోయా నిష్పాక్షిక తీర్పులు ఇచ్చారు. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన లోయా ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ హఠాత్తుగా అందరికీ దూరమయ్యారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆయన్ని హత్య చేశారన్న ఆగ్రహం అనేకమంది ఇతర న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ దెబ్బతింటే, ప్రజాస్వామ్యం మనుగడసాగించ లేదు'' అని చెప్పారు.
సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసును ప్రస్తావిస్తూ, ''జస్టిస్ లోయా 2014, డిసెంబరు 1న మరణించారు. ఆయన స్థానంలో కేసు విచారణను చేపట్టడానికి న్యాయమూర్తి ఎంబీ గోసావీ వచ్చారు. సీబీఐ దాఖలుచేసిన 10 వేల పేజీల ఛార్జ్షీట్ను కేవలం 15 రోజుల్లో చదవిన న్యాయమూర్తి ఎంబీ గోసావీ కీలక తీర్పు చెప్పేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న బీజేపీ చీఫ్ అమిత్ షాను నిర్దోషిగా తేల్చేశారు. 2005 నుంచి 9 ఏండ్లుగా నడుస్తున్న ఈకేసును కేవలం 15 రోజుల్లోనే న్యాయమూర్తి తేల్చేయటం ఆశ్చర్యపర్చింది''అని అన్నారు.
ఏ విషయమూ దాచాల్సిన అవసరం లేదు
జస్టిస్ లోయా మృతి కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం
దస్త్రాల్లో రహస్య సమాచారం, బహిర్గతం చేయవద్దన్న మహారాష్ట్ర
న్యూఢిల్లీ: సీబీఐ జడ్జి జస్టిస్ బీహెచ్ లోయా మృతిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 'అందరికీ అన్ని విషయాలు తెలియాలి. దాచాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించింది. సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసు విచారణ జరుపుతున్న లోయా 2014లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ విషయమూ దాచి ఉంచాల్సిన అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారణలో వెల్లడించింది. ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతున్న పిటిషనర్లకు.. లోయా మృతికి సంబంధించిన దస్త్రాలను అందజేయాలని కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తాజాగా ఆదేశించింది.
ఈ విచారణలో మహారాష్ట్ర ప్రభుత్వం లోయా పోస్ట్మార్టం నివేదికతో పాటు కేసుకు సంబంధించి అన్ని దస్త్రాలను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టులో అందజేసింది. దస్త్రాల్లో రహస్య సమాచారం ఉందని.. పిటిషనర్లకు, బయటి ప్రజలకు తెలియకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టును కోరారు. అయితే తమకు కేసుపై వాదించడానికి దస్త్రాల్లో సమాచారం తెలియాలని పిటిషనర్ల తరఫు కౌన్సిల్ ధర్మాసనాన్ని కోరింది. దీంతో కోర్టు అన్ని విషయాలు అందరికీ తెలియాలని, దస్త్రాలను పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.
దస్త్రాలను పిటిషనర్ల కౌన్సిల్కు ఇస్తాము, కానీ ప్రజలకు బహిర్గతం చేయొద్దని హరీష్ సాల్వే కోరారు. దీంతో వారంలోగా పిటిషనర్లకు సదరు దస్త్రాలను అందించాలని కోర్టు ఆదేశించింది. తాము కూడా దస్త్రాలను బహిర్గతం చేయబోమని పిటిషనర్ల కౌన్సిల్ హామీ ఇచ్చింది. లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని దాఖలైన రెండు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. మంగళవారంనాటి వాదనల అనంతరం విచారణ తేదీ వెల్లడించకుండా కేసును సుప్రీం వాయిదా వేసింది.