Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022 దాకా దశలవారీగా సబ్సిడీ తొలగించమన్న సుప్రీం
- 2012లో 836 కోట్ల సబ్సిడీ..2018లో జీరో
- ఖజానాకు భారమన్న బీజేపీ సర్కార్
- నరేంద్ర మోడీ ప్రభుత్వ మరో వివాదాస్పద నిర్ణయం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు సంబంధించి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. కానీ 2012లో సుప్రీం కోర్టు ఏమన్నదంటే.. హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని దశాబ్దకాలం పాటు గడువిచ్చింది. గత ఐదేండ్లలో సబ్సిడీపై కోత పెడుతూ...ప్రస్తుతం 25 శాతం మాత్రమే మిగిలింది. 2006లో విదేశీ మంత్రిత్వశాఖ, పర్యాటకశాఖలతో ఏర్పడిన పార్లమెంటరీ స్థాయిసంఘం హజ్ సబ్సిడీలను ఒక నిర్ణీత సమయంలో సబ్సిడీని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా సబ్సిడీపై పదేండ్ల పాటు వ్యవధిని పెట్టాలని అప్పటి కేంద్రప్రభుత్వానికి ఆదేశించింది. దాంతో అప్పటి యూపీఏ సర్కారు వెనక్కితగ్గింది. 2012 మైనార్టీ సంక్షేమశాఖ రిపోర్టుల ప్రకారం 836.55 కోట్లు హజ్ సబ్సిడీ అందజేసింది. ఆ తర్వాత ఈ సబ్సిడీని భారమంటూ కోత పెట్టడం మొదలుపెట్టింది. 2013లో ఏకంగా 150 కోట్ల మేర సబ్సిడీపై కోతపెట్టింది. అపుడు 680.03కోట్లు సబ్సిడీ ఇచ్చింది. 2014లో ఇక మోడీ అధికారంలోని వచ్చాక మరో వంద కోట్లను తగ్గించారు. అపుడు సబ్సిడ 577.07 కోట్లకు చేరింది. 2015లో మరో 50 కోట్లకు కోత పెట్టారు. 529.51 కోట్ల మేర సబ్సిడీ అందజేశారు. 2016లో మాత్రం కోతలు పెడుతూ 405 కోట్లకు చేర్చారు. ఇలా దశలవారీగా కోత పెడుతూ హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీ సగానికి చేరింది. 2017లో కేవలం 250కోట్లు మాత్రమే సబ్సిడీ ఇచ్చారు.ఈ ఏడాది(2018)లో సబ్సిడీ ఇవ్వమంటూ చేతులెత్తేసింది. వాస్తవానికి 2022లో సంపూర్ణంగా సబ్సిడీ ఎత్తివేయాల్సి ఉండగా, మోడీ సర్కారు ఆఘమేఘాలమీద సబ్సిడీని పూర్తిగా రద్దు చేసింది.
మోడీ సర్కారు అంటున్నదేంటీ..?
సబ్సిడీ రాయితీ మొత్తాన్ని ముస్లిం బాలికల విద్యకు ఉపయోగించనున్నట్టు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. మైనారిటీలకు సాధికారత కల్పించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నామన్నారు. ఈ రాయితీ వల్ల ముస్లిం ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆయన చెప్పారు. సబ్సిడీని ఎత్తివేస్తున్నప్పటికీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.75 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. సముద్ర మార్గం ద్వారా కూడా యాత్రికులు హజ్ చేరుకునేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి తెలిపారు. 45 ఏండ్ల కన్నా ఎక్కువ వయసుగల మహిళలు కనీసం నలుగురు బందంగా ఏర్పడితే, వారితోపాటు పురుష సహచరుడు లేకపోయినా హజ్ యాత్ర చేసేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. స్వల్ప వ్యవధిలోనే. సబ్సిడీని ఎత్తివేస్తూ ప్రకటనను చేయడం గమనార్హం. ప్రస్తుతమున్న హజ్ పాలసీని అధ్యయనం చేసి, 2018-22 వరకూ కొత్త హజ్ పాలసీ రూపకల్పన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏర్పాటుచేసింది. ఎయిర్ ఇండియా విమానచార్జీల్లో డిస్కౌంట్గా హజ్ యాత్రికులకు ప్రభుత్వం సబ్సిడీని ఇస్తూ వస్తోంది.