Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ పాలనలో వివక్ష ప్రభావం
- జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 నివేదిక
మహిళలకు సరైన పౌష్టికాహారం అందటంలేదనీ, దేశ అభివృద్ధికి ముఖ్యమైన వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని.. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి వల్లె వేస్తూనే ఉన్నారు. కాగా పుష్టికరమైన ఆహారం సమకూర్చడంలో కూడా దేశంలోని మహిళలు వివక్షకు గురవుతున్నారు. ఈ వాస్తవాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. దేశంలో 53 శాతం మంది అబలలకుసమతుల్యమైన ఆహారం అందడంలేదన్న కఠోరవాస్తవాలను కేంద్ర సంస్థ బహిర్గతం చేసింది.
న్యూఢిల్లీ : పుష్టికరమైన ఆహారం సమ కూర్చడంలో కూడా దేశంలోని మహిళలు వివక్షకు గురవుతున్నారు. దాదాపు సగం మందికి సమ తుల్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం లభించటం లేదని 2015-16 సంవత్సరానికి సిద్ధం చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలియజేస్తోంది. దాదాపు 47 శాతం మంది స్త్రీలకు మాత్రమే రోజూ ఆకు కూరలు, తాజా కూరగా యలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక సుమా రుగా 38 శాతం మంది మహిళలకు వారానికి ఒక్కసారి మాత్రమే ఇలాంటి పోషక ఆహారం లభిస్తోంది. ఆహారంలో తగినంత ప్రోటీన్లు, ఫాట్స్, కార్బొహైడ్రేట్స్, విటమిన్స్ ఇంకా ఇతర మినరల్స్ ఉంటేనే మహిళలకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా డయాబిటీస్, స్థూల దేహం, లివర్ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే ఆహారంలో సమృద్ధిగా ఆకు పచ్చని కూరలు, పండ్లు, తాజా కూరలు, పాలు, మాంసం, గ్రుడ్లు, పెరుగు వంటివి తగుపాళ్లలో ఉండాల్సిన అవసరం ఉందని డయాబిటీస్, ఇతర మెటబాలిక్ వ్యాధుల అధ్యయన కేంద్రం చైర్మెన్ అనూప్ మిశ్రా తెలిపారు. పప్పు ధాన్యాలు ప్రతి రోజూ తీసుకునే వారు 45 శాతం ఉంటున్నారు. దాదాపు అదే సంఖ్యలో మహిళలు వారానికి ఒకసారి మాత్రమే ఆ తరహా ఆహారం తీసుకుంటున్నారు. ఇక పాలు, పెరుగు వంటివి రోజూ తీసుకుంటున్న మహిళల శాతం 45 మాత్రమే కాగా, వారానికి మాత్రమే తీసుకుంటున్న వారు 23 శాతం వరకు ఉంటున్నారు. మహిళలకు సరైన ఆహారం అందకపోవడానికి పేదరికం కొంత వరకు కారణం అయినా, మహిళలకు అవసరమైన ఆహారంలో పోషకాల ప్రాధాన్యతను కుటుంబాలు గుర్తించకపోవడంతో పాటు వారి పట్ల ఉన్న చిన్న చూపు ప్రధాన కారణమని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చి డైరెక్టర్ రంజన కుమారి తెలిపారు. తక్కువ మోతాదులో ఆహారం, పోషక సమృద్ధి లేని ఆహారం మహిళలకు సర్వసాధారణంగా మారిందని ఆమె చెప్పారు. ఇక దాదాపు 54 శాతం మంది మహిళలు వారానికి ఒక్కసారి కూడా పండ్లు తీసుకోరు. చాలా కొద్ది మంది మాత్రమే రోజూ గుడ్డుమాంసం, చేపలు వంటివి ఆహారంలో తీసుకోగలుగుతున్నారు. పౌష్టికాహారాన్ని పక్కనబెడితే.. రేషన్ షాపుల ద్వారా పేదలకు ఇచ్చే ఆహార ధాన్యాలను కూడా మోడీ సర్కార్ అందకుండా చేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆధార్ లింకులు లేవనో.. మరొకటనో సాకు చెప్పి రేషన్ సరుకులను నిలిపివేస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో ఆకలిచావుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడంతో చేద్దామంటే పనిలేక... కనీసం ఒకపూట కూడా భోజనం లేక.. అల్లాడుతున్న పేదల ధీనవస్థలు అనేకం బయటపడ్డాయి. గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. అన్నదాతల దగ్గర నుంచి మొదలు... పేదలు ఆత్మహత్యల ఘటనలూ అనేకం వెలుగులోకి వచ్చాయి. గారడి మాటలకు ఇకనైనా స్వస్తి పలికి... పేద ప్రజలను ఆదుకునే చర్యలకు ఇకనైనా శ్రీకారం చుట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భారతీయ పురాణాల్లో మహిళలు శక్తి అవతారులు. వారిని దేవతలుగా కొలుస్తారు. మేం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తాం.. దేశాభివృద్ధికి ఇది చాలా ముఖ్యమని నమ్ముతున్నాం'
- డిసెంబర్ 28,2017 జీఈఎస్ సదస్సులో ప్రధాని మోడీ