Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గత వారం తిరుగుబాటు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో ప్రధాన న్యాయ మూర్తి దీపక్ మిశ్రా సుప్రీంకోర్టులో బుధవారం భోజన విరామ సమయంలో భేటీ అయ్యారు. అయితే న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అస్వస్థత కారణంగా కోర్టుకు హాజరు కాకపోవటంతో ఈ భేటీలో మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులూ పాల్గొన్నారు. తిరుగుబాటు అనంతరం తొలిసారిగా మంగళవారం నాడు ఈ నలుగురితో 15 నిముషాలు భేటీ అయిన ప్రధాన న్యాయమూర్తి 'అన్ని అంశాల'పై చర్చించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
నేడు మరోసారి...!
కేసుల కేటాయింపు, సుప్రీంకోర్టు పాలన విషయంలో తనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా గురువారం మరోసారి భేటీ కానున్నారు. న్యాయమూర్తి చలమేశ్వర్ బుధవారం జరిగిన భేటీకి హాజరు కాకపోవటంతో మిగిలిన వారితో భేటీ అసంపూర్ణంగానే ముగిసింది. దీనితో గురువారం నలుగురు న్యాయమూర్తులతో మరోసారి భేటీ అయి వివాదానికి తెరదించాలని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వివరించాయి.