Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హజ్ కమిటీ అధికారిపై వేటు
- యూపీ ప్రభుత్వ మరో వివాదాస్పద నిర్ణయం
లక్నో : హజ్ కమిటీ కార్యాలయానికి కాషాయరంగు వేయించి వివాదాస్పద నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరో కలహానికి తెరలేపింది. కాషాయ రంగు స్థానంలో తెలుపు రంగు వేసేందుకు ఆదేశాలు జారీచేసిన హజ్ కమిటీ సెక్రటరీ ఆర్పి సింగ్ను విధుల నుంచి తొలగించింది. మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టరేట్లో సింగ్ జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సింగ్ స్థానంలో అసిస్టెంట్ డైరెక్టర్ వినీత్ శ్రీవాత్సవను నియమిస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. లక్నోలోని హజ్ హౌస్కు జనవరి 5న కాషాయరంగు వేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాంట్రాక్టర్ పొరపాటున ఆ రంగు వేశాడనీ ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకుంది. కాషాయరంగు స్థానంలో తిరిగి తెల్లరంగును వేయించారు. రంగు మార్చడంపై వివరణ ఇవ్వాల్సిందిగా హజ్, ముస్లిం వక్ఫ్ బోర్డు శాఖ మంత్రి మొహసిన్ రాజా నుంచి సింగ్కు ఈ నెల 11న నోటీసులు అందాయి. 'కాషాయరంగు అప్పటికే వేసి ఉండగా, ఏ పరిస్థితుల్లో రంగు మార్చాలన్న నిర్ణయం తీసుకున్నారు. అంత అవసరం ఏం వచ్చింది? రంగు మార్చేందుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? బాధ్యులు ఎవరు? రెండోసారి పెయింటింగ్కు అయిన ఖర్చులను ఎవరు భరిస్తారు?' అని ఆ నోటీసుల్లో ప్రశ్నించారు.