Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన 18 వేల టాక్సీలు
- ఇబ్బందులు పడ్డ పర్యాటకులు, ప్రయాణీకులు
పనాజీ: గోవాలో టాక్సీ ఆపరేటర్లు శుక్రవారం సమ్మె నిర్వహించారు. దీంతో దాదాపు 18 వేల టాక్సీలు రోడ్డెక్కలేదు. ప్రయాణీకులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ్మెను భగం చేసేందుకు ప్రభుత్వం నిత్యావసర సేవల నిర్వహణ చట్టాన్ని విధించినప్పటికీ ఆపరేటర్లు లెక్కచేయకుండా ఆందోళనకు దిగారు. పనాజీలోని అజాత్ మైదాన్కు చేరుకున్న ఆపరేటర్లు సమ్మెలో పాల్గొన్నారు. వాహనాలలో స్పీడ్ గవర్నర్లు (వేగ నియంత్రణ పరికరాన్ని) ఏర్పాటు చేయడం, పోలీసులు, ట్రాన్స్పోర్టు అధికారుల వేధింపులకు నిరసనగా ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. సమ్మె సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడొద్దని ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గురువారం డ్రైవర్లను హెచ్చరించారు. హింసాత్మక చర్యల్లో పాల్గొన్న వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.
తాము సమ్మె చేయనున్నట్టు 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని ఉత్తర గోవా టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తమని భరించరాని వేధింపులకు గురిచేస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ కార్గొయంకర్ తెలిపారు. వాహనాలలో స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడా వీటిని ఏర్పాటు చేయలేదని, తమ మీదే ఎందుకు ఒత్తిడి తెస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రయివేటు వాహనాలను, బస్సులను రంగంలోకి దించిందని చెప్పారు. టాక్సీ అసోసియేషన్లు సమ్మె చేస్తున్న నేపధ్యంలో ప్రయాణికులకు, పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గోవా పర్యాటక శాఖ తెలిపింది.