Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో సీబీఐ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసులో బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షాను కింది కోర్టు తప్పించడాన్ని సీబీఐ సవాల్ చేయనందుకు నిరసనగా ముంబయి న్యాయవాదుల సంఘం ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం దాఖలు చేసింది. అమిత్ షా విషయమై సెషన్స్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పునర్విచారణ దరఖాస్తు కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని తన పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్పై న్యాయమూర్తులు ఎస్సి ధర్మాధికారి, భారతి ధంగ్రేలతో కూడిన ధర్మాసనం ఈనెల 22న విచారించే అవకాశం ఉన్నదని న్యాయవాదుల సంఘం తరఫు న్యాయవాది అహ్మద్ అబిది వెల్లడించారు. ''సీబీఐ ఒక ప్రధాన దర్యాప్తు సంస్థ. చట్టపరమైన పాలన పరిశీలించాల్సిన బాధ్యత దానిపై ఉంది. కానీ సోహ్రాబుద్దీన్ కేసు విషయంలో ఘోరంగా విఫలమైంది'' అని పిటిషన్లో పేర్కొన్నారు.
2005లో నవంబర్ 26న గుజరాత్, రాజస్థాన్ పోలీసులు సోహ్రాబుద్దీన్ను, అతని భార్యను ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసుపై 2010 ఫిబ్రవరిలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అదే ఏడాది జులైలో అమిత్షా సహా 23 మంది నిందితులపై చార్జిషీటు దాఖలు చేసింది. తర్వాత అమిత్షా, మరి కొంతమందిని కేసు నుంచి తప్పిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.