Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ కంపెనీలకు అనుకూలంగా నూతన విధానం
- పన్ను ప్రోత్సాహకాలు, కోర్టుకు పోయే..హక్కు ఉండాలంటున్న కంపెనీలు
- విదేశీ కంపెనీలను ఒప్పించే పనిలో మోడీ సర్కార్
భారత్ తమకు పన్ను ప్రోత్సాహకం ఇవ్వటం లేదని, ఇందుకు నష్టపరిహారంగా రూ.4915 వేల కోట్లు (770 మిలియన్ డాలర్లు) భారత్ నుంచి ఇప్పించాల్సిందిగా అంతర్జాతీయ కోర్టులో జపాన్ మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీ 'నిస్సాన్' కేసు వేసింది. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో భారత్ ప్రభుత్వానికి-జపాన్కు మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ఫలితమిది. ప్రస్తుతం 'నూతన పెట్టుబడుల ఒప్పందం' ముసాయిదా ప్రతిని మోడీ సర్కార్ తయారుచేస్తున్నది. గత 10నెలలుగా దీనిపై జరుగుతున్న కసరత్తును గమనించిన కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..''విదేశీ కంపెనీలను తృప్తిపర్చే విధంగా ప్రతిపాదనలపై సంప్రదింపులు జరుగుతున్నా''యని ప్రముఖ మీడియా ముందు చెప్పారు. ముందు ముందు 'నిస్సాన్'లాంటి అనుభవాలు మరిన్ని ఎదురవుతాయన్న హెచ్చరిక ఆయన మాటల్లో వ్యక్తమైంది.
న్యూఢిల్లీ : తమ పెట్టుబడుల ప్రయోజనాల్ని కాపాడాల్సిందిగా వొడాఫోన్ గ్రూప్ (బ్రిటన్ టెలికాం సంస్థ), కైర్న్ ఎనర్జీ (బ్రిటన్ ఆయిల్, గ్యాస్ కంపెనీ), డాయిష్ టెలికాం(జర్మనీలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ)...తదితర కంపెనీలు అంతర్జాతీయ కోర్టులో కేసులు వేశాయి. భారత్కు వ్యతిరేకంగా ఇలాంటి కేసులు అంతర్జాతీయ కోర్టుల్లో 20దాకా ఉన్నాయి. ఒకవేళ కోర్టు తీర్పు భారత్కు వ్యతిరేకంగా వస్తే...కొన్ని బిలియన్ డాలర్లు నష్టపరిహారంగా ఆయా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత తీవ్ర నష్టదాయకమైన ఆర్థిక విధానాన్ని భారత్ ఎందుకు కొనసాగించాలి ? అంత బలహీనంగా విదేశీ కంపెనీల డిమాండ్లకు తలొగ్గాలా ? అన్నది ఆర్థిక రంగ నిపుణుల ప్రశ్న.
ఇండియాలో మేం పెట్టుబడులు పెడతాం. కానీ మాకు ఇంతకుముందులా పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొత్త నిబంధనలు తీసుకురాకూడదు. ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకునే హక్కు ఉండరాదు. భారత్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాల్ని ఆశ్రయించే హక్కు ఉండాల్సిందే, లేదంటే భారత్లో పెట్టుబడులు పెట్టం..అంటూ విదేశీ కంపెనీలు భారత్ సర్కార్పై ఒత్తిడి చేస్తున్నాయి. మీరు తీసుకురాబోతున్న 'నూతన పెట్టుబడుల ఒప్పందం'లో నియంత్రణలు, పరిమితులు ఉండటానికి వీల్లేదంటూ 'మోడీ సర్కార్'తో విదేశీ కంపెనీలు బేరసారాలు ఆడుతున్నాయి.
అలా ఉంటేనే పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశాయి. వారు చేసే సూచనలు, మార్పులతో కొత్త విధానం తేస్తే భారత్కు ఎనలేని నష్టం వాటిల్లుతుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూతన విధానంపై ఆస్ట్రేలియా, ఇరాన్, కెనడా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో భారత్ ఇప్పటికే చర్చలు జరిపింది. తమకు పన్ను ప్రయోజనాలు, పెట్టుబడిపై భద్రత, నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కటం వంటివి వదులకునేది లేదని కుండబద్దలు కొట్టాయి. నిజానికి మోడీ సర్కార్ తీసుకొస్తున్న ఈ విధానంలో ఎలాంటి నియంత్రణలు, పరిమితులూ లేవు. బ్రెజిల్, ఇండోనేషియా అమల్లోకితెచ్చిన నూతన పెట్టుబడుల విధానాన్ని మక్కీమక్కీగా ఇక్కడా తీసుకొస్తున్నారు.
కొత్త విధానం కోసం ఎదురుచూస్తున్నాయి..
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర దేశాలతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు...అనుకున్నంత స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మోడీ సర్కార్ మూడేండ్ల పాలనలో...రెండున్నర సంవత్సరాల పాలన చూశాక కూడా 'విదేశీ పెట్టుబడులు' ఆశించిన మేరకు రాలేదు. భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాల్ని 2017లో దాదాపు 50 దేశాలు రద్దుచేసుకున్నాయి. ఎందుకంటే గతంకన్నా మించి 'ప్రయోజనాల్ని, ప్రోత్సాహకాల్ని' అవి ఆశిస్తున్నాయి. దీంతో ఆయా విదేశీ కంపెనీల ప్రతినిధుల్ని సంతృప్తి పర్చే విధివిధానాలపై మోడీ సర్కార్ కసరత్తు చేయటం బయటకు పొక్కింది. ఈనేపథ్యంలో ఒప్పందంపై విదేశాల్ని ఒప్పంచే ప్రయత్నాలు మోడీ సర్కార్ వేగవంతం చేసింది.