Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మంది ఎమ్మెల్యేల అనర్హతకు
- ఎలక్షన్ కమిషన్ సిఫార్సు..?
- 'లాభదాయక పోస్టుల' వ్యవహారంలో రాష్ట్రపతికి ప్రతిపాదన
- హైకోర్టు తలుపుతట్టిన ఆప్ ప్రజాప్రతినిధులు
- స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరణ
- కేంద్ర సర్కారు రచించిన 'కుట్ర' : ఆమాద్మీపార్టీ
- కేజ్రీవాల్ రాజీనామా చేయాలి : కాంగ్రెస్, బీజేపీ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
ఢిల్లీలోని ఆమాద్మీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 'లాభదాయక పోస్టులు' చేపట్టారన్న అభియోగాలపై ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 2015లో ఆమాద్మీ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంట్ కార్యదర్శులుగా నియమిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధులను కేబినెట్ హోదాలో పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించారని, ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్తో పాటు ఇతరులు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఎన్నికల కమిషన్కు ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంలో 20 మంది ఆమాద్మీపార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్ ప్రతిపాదించినట్టు శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువరించలేదు. కాగా, ఈసీ ప్రతిపాదనలపై ఆమాద్మీ పార్టీ ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టింది. అయితే, ఈసీ సిఫార్సులపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇదే సమయంలో రాష్ట్రపతికి ప్రతిపాదించారా లేదా అన్న విషయాన్ని ధ్రువీకరించాలని ఈసీకి ఆదేశించింది. ఈసీ నిర్ణయాన్ని ఆప్ తప్పుపట్టింది. సీఈసీ(చీఫ్ ఎలక్షన్ కమిషనర్) ఏకే జోతి సోమవారం పదవీ విరమణ చేయనున్నారని, ఈ నేపథ్యంలో తనను సీఈసీగా నియమించినందుకు ప్రధాని మోడీ రుణం తీర్చుకునేందుకు 'అనర్హత' ప్రతిపాదన చేశారని దుయ్యబట్టింది. కాగా, 20 మందిపై అనర్హతవేటు వేసినప్పటికీ ఇప్పటికిప్పుడు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టామేమీ లేదు. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య 66. ఇందులో 20 మందిపై అనర్హత వేటు వేసినా మ్యాజిక్ ఫిగర్ 36 సంఖ్యా బలం ఆ పార్టీకి ఉండనుంది.
ఏంటీ ఈ వివాదం...!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలు గెలిచి సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమాద్మీపార్టీ సర్కారు... 2015 మార్చి 13న 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. ఇందులో ఇటీవల ఉప ఎన్నికల్లో ఓడిపోయిన జర్నల్సింగ్ కూడా ఉన్నారు. ఈ పార్లమెంట్ కార్యదర్శులకు అదనపు చెల్లింపులు ఉండబోవని ఆ సమయంలో కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం విద్య, ఆరోగ్యం, మున్సిపాల్టీ తదితర పాలన విషయాల్లో వీరి సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వీరిని నియమించారని న్యాయవాది ప్రశాంత్ పటేల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన న్యాయస్థానం.. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ను సంప్రదించకుండానే వీరిని నియమించారని, కాబట్టి పార్లమెంట్ కార్యదర్శలుగా వీరి నియామకం చెల్లుబాటు కాదని 2016, సెప్టెంబర్ 8వ తేదీన తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షులు అజరుమాకెన్ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ అంశంపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈసీకి రాష్ట్రపతి ఆదేశించారు. అయితే తమ నియామకాన్ని హైకోర్టు కోట్టివేసిందని, కాబట్టి ఈ అంశంపై విచారణ చేపట్టొద్దని ఈసీలో ఆప్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో ఈసీ ముందుకు వెళ్లింది. ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఢిల్లీ సర్కారు ఓ చట్టం చేసింది. లాభదాయక పదవుల నిర్వచనం నుంచి పార్లమెంట్ కార్యదర్శులను మినహాయిస్తూ బిల్లు ఆమోదించింది. లెఫ్ట్నెంట్ గవర్నర్ నుంచి ఈ బిల్లు కేంద్రానికి వెళ్లింది. కేంద్రం కొన్ని వ్యాఖ్యలతో రాష్ట్రపతికి నివేదించింది. అయితే, ఈ బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపారు.
బీజేపీ రచించిన 'కుట్ర' : ఆమాద్మీపార్టీ
20 మంది ప్రజాప్రతినిధులపై అనర్హతవేటు వేయాలన్న ఈసీ సిఫార్సులను ఆమాద్మీపార్టీ తప్పుపట్టింది. ఈ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. 'ప్రపంచంలో ఎక్కడైనా ఒక వ్యక్తిపై ఆరోపణలు వస్తే ఆయన వాదన వినిపించేందుకు ఒక అవకాశం కల్పిస్తారు. కానీ, ఈ వ్యవహారంలో ఆమాద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను, వాదనను పరిగణలోకి తీసుకోలేదు. ఇక లాభదాయక పోస్టుల వ్యవహారంలో చర్యలు అంటున్నారు. అసలు 'లాభదాయక' నిర్వచనం అర్థం తెలుసుకోవాలి. ఈ 20 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వాహనం, భవంతి లేదా వేతనం ఇతర వసతులు తీసుకోలేదు. 20 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి లబ్ది పొందారని నిరూపిస్తే నైతిక బాధ్యత వహిస్తాం' అని అన్నారు. సీఈసీ ఏకే జోతిపై విమర్శలు గుప్పించారు. మోడీ గుజరాత్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఏకే జోతిని సీఈసీగా నియమించారని తెలిపారు. సోమవారంతో ఆయన పదవీకాలం ముగియనుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మోడీ రుణం తీర్చుకునేందుకు అనర్హత నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ఎమ్మెల్యేలు...
ఈసీ ప్రతిపాదనలపై స్టే విధించాలని కోరుతూ ఆమాద్మీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈసీ నోటీసులు పంపిందా అని ఎమ్మెల్యేలను ప్రశ్నించిన న్యాయస్థానం.. సిఫార్సులపై స్టే విధించలేమని తెలిపింది.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కోర్టులో బంతి...
ఈసీ ప్రతిపాదనల నేపథ్యంలో అనర్హత అంశం ప్రస్తుతం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పరిధిలో ఉంది. ఒకవేళ ఈసీ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఢిల్లీలో ఉప ఎన్నికల పోరు తప్పదు. అంతకుముందే ఈసీ ప్రతిపాదనలపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తరువాత సుప్రీంకోర్టు సైతం ఈ అంశంలో జోక్యం చేసుకునే అవకాశం ఉండబోదు. అదే సమయంలో ఈ వ్యవహారంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ న్యాయసలహా కోరితే అనర్హత అంశం మరికొన్ని రోజులు వాయిదా పడనుంది.
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలి...
20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఈసీ నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షులు అజరుమాకెన్, బీజేపీ ఢిల్లీ యూనిట్ ప్రెసిడెంట్ మనోజ్తివారీ డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై సగం మంది మంత్రులు రాజీనామాలు చేశారని, ఇప్పుడు 21 మందిపై ఈసీ అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయారని దుయ్యబట్టారు. కాగా, లాభదాయక పోస్టుల వ్యవహారంలో ఆప్ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షులు అజరుమాకెన్ ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం వారం క్రితం ఈసీని కలిసింది. ఈ వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.