Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాసిక్: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఐదేండ్ల క్రితం ముగ్గురు దళిత యువకులను కులదురహంకార హత్యలు చేసిన కేసులో ఆరుగురు దోషులకు నాసిక్ జిల్లా సెషన్స్ కోర్టు మరణ శిక్షను విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది. 'దోషులది అత్యంత హేయమైన చర్య అని న్యాయమూర్తి రాజేంద్రకుమార్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. దోషులకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని తీర్పునిచ్చారు' అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు. ఘారు(24) అనే దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కాగా యువతి కుటుంబాన్ని ఎదురించి పెండ్లి చేసుకోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి పోపట్ వి.దరండాలే, సోదరుడు గణేష్లు వారి బంధువులు, స్నేహితుల సహాయంతో ఘారు, అతని ఇద్దరు మిత్రుల (తన్వర్,రాహుల్ కదారే)ను 2013 జనవరి 1న అత్యంత దారుణంగా హతమార్చారు. కొడవలితో ఘారు తలను, అవయవాలను నరికి సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. మిగతా ఇద్దరిని హతమార్చి ఖననం చేశారు.
'దోషులు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం మరిచిపోయారు. వారికి సమాజంలో జీవించే హక్కు లేదు. వారికి మరణ శిక్షే సరైన మార్గం' అని జడ్జి స్పందించారు. అత్యంత భయంకరమైన అరుదైన కేసుల్లో ఇది ఒకటి అని ఉజ్వల్ నిఖమ్ వ్యాఖ్యా నించారు. ఈ కేసులో దోషిగా ఉన్న గణేష్ దండేవాలేది చాలా చిన్న వయస్సని అతని పై దయ చూపాలని వారి తరఫు న్యాయవాది ఎస్ఎస్ అడాస్ వాదించారు. కాగా ఆధారాలు లేకపోవడంతో ఏడుగురు నింది తుల్లో ఒకరైన అశోక్ ఆర్. ఫాల్కే నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ కేసును అప్పటి రాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్..సీఐడీకి అప్పగించారు.