Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సస్పెండ్ చేసినందుకు ప్రతీకారంగా..
- హర్యానాలో దారుణం.
యమునానగర్: చదువులో వెనుకపడి పోతున్నావు.హాజరు శాతమూ తగ్గిపోతోంది. పద్ధతి మార్చుకోమని సస్పెండ్ చేసినందుకు ప్రిన్సిపాల్ను అతికిరాతకంగా కాల్చి చంపేశాడో స్టూడెంట్. ఈ దారుణం హర్యానాలో జరిగింది. శనివారం ప్రిన్సిపాల్,స్టూడెంట్ మధ్య జరిగిన ఘటన ఇది. అందరితో గొడవలు పడుతున్నావు..దాంతో హాజరు శాతం తగ్గిపోతుంది..అని మందలించడమే ఆ ప్రిన్సిపాల్ ప్రాణం మీదకు తెచ్చింది. పద్ధతి మార్చుకోవాలంటూ పాఠశాల నుంచి ఆమె కొన్ని రోజులు సస్పెండ్ చేశారు. స్టూడెంట్ కోపమే ఆమెను అంతమొందించింది. ఉపాధ్యాయులు, సిబ్బంది చూస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హర్యానాలోని యమునానగర్కు చెందిన ఓ ప్రయివేట్ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి అందరితో గొడవలు పడుతూ ఉండేవాడు. దీంతో అతని చదువుపై శ్రద్ధ తగ్గింది. అతని ప్రవర్తనను గమనించిన పాఠశాల ప్రిన్సిపల్ అతణ్ని దారిలో తేవటానికి మందలించి..రెండు వారాల పాటు పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. అవమానానికి గురైన ఆ విద్యార్థి ప్రిన్సిపల్పై పగ పెంచుకున్నాడు. శనివారం నేరుగా ప్రిన్సిపల్ను కలవాలంటూ ఆమె గదికే వెళ్లాడు. లోపలికి వెళ్లి తనతో తెచ్చుకున్న తుపాకీతో దారుణంగా ప్రిన్సిపల్పై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి చొచ్చుకొని పోవడంతో అక్కడిక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన తండ్రి తుపాకీని ఉపయోగించినందుకుగానూ అతనిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.