Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టుల్లో న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నాం
- లేకపోతే ప్రజాకోర్టులో తేల్చుకుంటాం
- ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
- సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రగా ఆరోపణ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
ఆమాద్మీపార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష ప్రతిపాదనలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. 'లాభదాయక పోస్టుల' అభియోగాలపై విచారణ చేపట్టకుండా, కనీసం ఎమ్మెల్యే వైఖరి వినకుండా ఈసీ ఏకపక్షంగా ప్రతిపాదనలు చేసిందని విమర్శించారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతికి నివేదించి న్యాయం చేయాలని కోరుతామని చెప్పారు. ఈ అంశంలో కోర్టుల్లో న్యాయం లభిస్తుందన్న విశ్వాసం తమకు ఉందని అన్నారు. ఒకవేళ కోర్టుల్లోనూ న్యాయం దక్కకపోతే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న 20 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నయాపైసా తీసుకోలేదని, ఇందుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులను పార్లమెంట్ కార్యదర్శులను నియమించాయని, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతూ లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆప్ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ రచించిన కుట్రగా సిసోడియా అభివర్ణించారు. ఆప్ ఎమ్మెల్యేల అనర్హత వేటు ప్రతిపాదనలపై శనివారం మనీష్సిసోడియా విలేకరుల సమావేశం నిర్వహించారు. 'ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆప్ సర్కారు మూడేండ్లు పూర్తి చేసుకుని నాల్గో సంవత్సరంలోకి వెళ్తోంది. ఇప్పటికే మూడో గేర్ స్పీడ్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సర్కారు.. ప్రస్తుతం నాల్గో గేర్లో వెళ్లేందుకు సిద్ధమైంది. ఢిల్లీ సర్కారు కార్యక్రమాలు అమలు జరిగితే తమకు ఇబ్బంది అని గ్రహించి బీజేపీ నేతలు ఈ కుట్రలకు తెరలేపారు' అని సిసోడియా ఆరోపించారు. 'గత మూడేండ్లలో మోహాల్లా క్లినిక్లను ఏర్పాటు చేశాం. కరెంటు చార్జీలు పెంచలేదు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేశాం. పింఛన్లను పెంచాం. ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ బీజేపీకి కంటగింపుగా మారాయి. పైగా త్వరలో ప్రభుత్వ సేవలను ఇంటింటికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. సీసీటీవీల ఏర్పాటు తుది దశకు చేరింది. వైఫై నిర్మాణం పూర్తవుతోంది. ఆప్ సర్కారును అస్థిరపరిచి ఈ కార్యక్రమాలన్నీ అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది' అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ మూడున్నరేండ్లలో చేసేందేమీ లేదని, ప్రజాసంక్షేమ విధానాలు అమలు చేయలేదని అన్నారు. అందుకే నిజాయితీగా పని చేస్తున్న ఆప్ను తప్పించాలని భావిస్తోందని దుయ్యబట్టారు.
ఇక ఈ 20 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే బీజేపీకి, కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు.