Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్తమోడుతున్నా పట్టించుకోని వైనం
లక్నో: యాక్సిడెంట్లో ఇద్దరు విద్యార్థులకు రక్తమోడుతున్నా.. ఖాకీల మనస్సు కరగలేదు. తమ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తే సీట్లకు రక్తపు మరకలు అంటుతాయని భావించారు. క్షతగాత్రులు, అక్కడున్న వారు వేడుకున్నా కనికరం చూపలేదు. దీంతో పరిస్థితి విషమించి వారిద్దరూ చనిపోయారు. ఈ హృదయ విధారక ఘటన ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో చోటు చేసుకున్నది.
సహరాన్పూర్లో గురువారం అర్ధరాత్రి ఇద్దరు స్నేహితులు(వారి వయస్సు 17 సంవత్సరాలు) బైకుపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 100 నెంబర్కు డయల్ చేయగా.. ఓ పెట్రోలింగ్ వాహనం అక్కడికి వచ్చింది. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించాల్సింది పోయి ముగ్గురు కానిస్టేబుళ్లు చోద్యం చూశారు. వారిని వాహనంలో తీసుకెళ్తే సీట్లకు మరకలు అంటుతాయని చర్చించుకోవడం వారి వంతైంది. ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఇద్దరు విద్యార్థులు, స్థానికంగా ఉన్న కొందరు వేడుకున్నా వారు వినలేదు. ఆ దారిన పోయే వాహనాలను స్థానికులు ఆపినా ఫలితం లేకపోయింది. ఇంతలో అక్కడున్న ఓ వ్యక్తి ముందుకొచ్చి.. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లండి.. కారును తాను కడుగుతానని పోలీసులను అభ్యర్థించాడు. కారును శుభ్రం చేస్తే రాత్రంతా ఎక్కడ పడుకోవాలని ఆ కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
చాలా సేపటి తర్వాత మరో పోలీసు వాహనం వచ్చింది. ఆ వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వారిద్దరూ అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కానిస్టేబుళ్ల నిర్వాకాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని, విచారణ తర్వాత వారిపై మరిన్ని చర్యలుంటాయని డీఐజీ సునీల్ ఎమ్యాన్యూల్ వెల్లడించారు.