Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర మాజీ మంత్రి అరుణ్శౌరీన్యాయవ్యవస్థను కుదిపేస్తూ తీవ్ర సంచలనానికి దారి తీస్తున్న న్యాయమూర్తి లోయా మృతి కేసులో బిర్లా-సహారా డైరీలు అత్యంత కీలకమైనవని, ప్రస్తుత పాలకులకు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ పాత్రికేయుడు అరుణ్శౌరీ వ్యాఖ్యానించారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుప్రీంకోర్టులోని తాజా పరిణామాలను ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థ ఎటుపో తోందో అర్ధం కాని పరిస్థితి కొనసాగుతోం దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ విశేషాలు సంక్షిప్తంగా..
అనూహ్యమైన రీతిలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు పాలనపై మీడియాకెక్కటాన్ని మీరేమంటారు? న్యాయ వ్యవస్థ స్వతంత్రతలో రాజీ పడితే మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనగలుగుతుందా?
ఏదైనా తప్పు జరిగినపుడు గాంధీజీ సహనం వహించాలనిచెప్పే వారు. అయితే దానిని ఎదుర్కొనే విషయంలో ఆయన ఈ పదాన్ని ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన 'సహించరాని తప్పిదం' అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాను. మనం ఇతర మార్గాలను అనుసరించినా తప్పు దిద్దుబాటు కానపుడు, తదుపరి అడుగు వేయటానికి మనం వెనుకాడరాదు. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలోనూ, మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలలోనూ ఈ విషయమే స్పష్టమవుతోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను గత కొద్దినెలలుగా ప్రధాన న్యాయమూర్తి వద్ద ప్రస్తావిస్తున్నామని, ఆర్పి లూథ్రా కేసులో నిర్ణయం తీసుకున్న నవంబర్ 8కి ముందు రాసిన లేఖలో వారు గుర్తు చేశారు. అయితే దీనిపై ఎటువంటి చర్యా తీసుకున్న దాఖలాలు కన్పించలేదు. మీడియా సమావేశంలో న్యాయమూర్తులు చలమేశ్వర్, గగోరులు చెప్పినట్టుగా న్యాయమూర్తి లోయా మృతి కేసు విచారణ కేటాయింపు ఇందులో అత్యంత కీలకమైన అంశం.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడినందునే తాము మీడియా ద్వారా ప్రజల ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్టు వారు చెప్పిన దానిపై మీ స్పందన?
తప్పకుండా.. ఇది అందరి దృష్టికీ తీసుకురావాల్సిన అంశమే..కొన్ని ఎంపిక చేసిన ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ఎటువంటి హేతుబద్ధత కానీ, నియమ నిబంధన ప్రకారం కానీ లేకుండా గతం నుండి అనుసరిస్తున్న సంప్రదాయాలను కాలరాస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే న్యాయవ్యవస్థ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినటం ఖాయం. ఈ విధానం ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా కొనసాగిందన్న విషయాన్ని న్యాయమూర్తులు తమ లేఖలో ప్రస్తావించటాన్ని మనం గుర్తించాలి.
న్యాయమూర్తులు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని కొందరు ఆరెస్సెస్ నేతలు ఆరోపిస్తున్నారు.. మీరేమంటారు?
ముందుగా నేను భయపడే అంశం.. ఆరెస్సెస్లో పలువురు తామేదో దైవాంశసంభూతులమని భావిస్తుంటారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా గతంలో వెలువరించిన కొన్ని తీర్పులు కొంతమంది వ్యక్తులను ఏ విధంగా సంతోషపెట్టాయో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. గతంలో ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన సమయంలో 'కభీ ఖుషీ కభీ గమ్' అనే చిత్రానికి సంబంధించి వెలువరించిన తీర్పు చదివారా? జాతీయగీతాలాపనకు సంబంధించి ఆయనేమన్నారు? సరిగ్గా చెప్పాలంటే స్వయం ప్రకటిత 'జాతీయ వాదుల'ను సంతృప్తి పరిచే తీర్పు అది. వాస్తవానికి ఈ తీర్పు అత్యంత నాటకీయమైనది, అవమానకరమైనది. అందువల్లే దీనిని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. కేవలం జస్టిస్ మిశ్రా మాత్రమే ఏ కేసులోనైనా తానిచ్చిన తీర్పును తానే తిరగరాయగలరన్న విషయం దీనితో నిర్దారణ అవుతోంది కదా. గతంలో కాదు ఇప్పుడు కూడా ఇది అనేక సందర్భాలలో నిర్ధారితమైన అంశమే. రామజన్మభూమి వివాదానికి సంబంధించి ఆయన వెలువరించే తీర్పు కోసం అనేక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ప్రస్తుత పాలకులకు రానున్న ఎన్నికల్లో పనికివచ్చే అంశం కావటమే ఇందుకు కారణం.
అయితే ఈ నలుగురున్యాయమూర్తులూ మీడియాకెక్కటాన్ని ఇతరులు విమర్శిస్తున్నారు కదా? మరో మాజీ న్యాయమూర్తి అయితే వారిని అభిశంసించాల్సిందేననే వరకూ వెళ్లారు. కొంతమంది వారు అంతర్గత సమస్యలు అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని చెబుతున్నారు? దీనిపై మీ అభిప్రాయం..
వారు సుప్రీంకోర్టు పరిధిలోనే సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించారు. వారి లేఖ ద్వారా ఈ అంశం స్పష్టమవుతోంది. తమ ప్రయత్నం ఫలించనందునే వారు మీడియాకెక్కారు. వారిపై విమర్శలు చేసే ముందు వెనుకముందులాలోచించుకోవాలి. వారు ప్రస్తావించిన అంశాలు నిజమా? కాదా? ఇందులో ఏ ఒక్కటయినా తప్పుందేమో చెప్పండి?
వారు ప్రస్తావించిన నాలుగు కేసుల్లో మిమ్మల్ని ఎక్కువగా కదిలించిన అంశాలేమిటి? లోయా కేసులో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరా? వైద్య కళాశాలల ముడుపుల కుంభకోణంకేసా?, రాజకీయ నేతలకు ముడుపులు అందించినట్టు వెల్లడించిన బిర్లా-సహారా డైరీల కేసా? లేక ఖలికోపుల్ ఆత్మహత్యాపత్రం విషయంలో న్యాయవ్యవస్థ వ్యవహరించిన తీరా?
ఇందులో రెండు సామ్యాలున్నాయి. మీరు ప్రస్తావించిన రెండు కేసులు బిర్లా సహారా డైరీలు.. ఖలికోపుల్ కేసు.. ఈ రెండు యూపీఏ ప్రభుత్వ పాలకుల ప్రయోజనాలకు సంబంధించినవే.. బిర్లా సహారా డైరీల కేసు, లోయా మృతి కేసు ప్రస్తుత పాలకుల ప్రయోజనాలకు సంబంధించినవి. అందువల్లే ఈ కేసుల్లో ఏం జరుగుతోందన్న విషయాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక రెండోది ఖలికోపుల్ ఆత్మహత్యా పత్రం.. లోయా కేసు, వైద్య కళాశాలల లంచాల కేసు.. అఫ్కోర్స్ న్యాయవ్యవస్థ ప్రమేయం వుందన్న ఆరోపణలు కూడా వున్నాయనుకోండి.. అందువల్లే నలుగురు సీనియర్ న్యాయమూర్తులూ ఈ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని మీడియా ముందు ప్రస్తావించారు. స్వయంగా న్యాయవ్యవస్థ ప్రమేయం వున్న కేసుల్లో న్యాయమూర్తులు కళ్లు మూసుకు వ్యవహరించాలన్న వాదనను ఎవరూ ఒప్పుకోరు.
ఇప్పుడేం చేయవచ్చని మీరు భావిస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయవ్యవస్థను ఏ విధంగా రక్షించవచ్చునంంటారు?
తప్పనిసరిగా ఇది ప్రధాన న్యాయమూర్తి బాధ్యతే.. ఇందుకు ముందుగా ఆయన చేయాల్సింది సీనియర్ న్యాయమూర్తులతో కలిసి కూర్చుని ధర్మాసనాల మధ్య కేసుల కేటాయింపునకు సంబంధించిన పారదర్శకమైన విధివిధానాలను రూపొందించాలి. రెండోది, ఆయన చేయాల్సింది ప్రశాంత్భూషణ్ చేసిన ఆరోపణలపై ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి.. గౌరవ ప్రదమైన ఏ వ్యక్తి అయినా ఇందుకు ప్రయత్నిస్తారు. సత్వర విచారణ జరిపించి ఫలితాలను బహిర్గతం చేయాలి. అక్కడితే ఈ వివాదానికి తెరపడుతుంది. వ్యవస్థ బలోపేతమవు తుంది. ప్రస్తుతం అనేక మంది చెబుతున్న ఈ 'సంక్షోభం' సంస్కరణకు అవకాశంగా మారుతుంది.
ఎన్నికల విజయాలు ప్రధాని నరేంద్రమోడీకి నైతిక బలాన్నిచ్చి వుండొచ్చు. దీనితోనే ఆయన విధానపరమైన, కీలక వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం వుంది. ఆయన సొంత మంత్రులే తాము రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ బహిరంగంగా చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం. భారతీయ సంస్కృతీ, విలువలను రాజ్యాంగం ప్రతిబింబించటం లేదని ఆరెస్సెస్ చెబుతోంది. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తామనుకుంటున్నారు? సర్వోన్నత న్యాయవ్యవస్థను విధ్వంసం చేయటం ఈ విస్తృత ప్రాజెక్టులో భాగమనుకోవాలా?
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని వ్యవహరించిన తీరు, ఆయన ఉపయోగించిన భాష వంటి వాటిని పరిశీలిస్తే మీరు చెబుతున్న 'నైతిక బలం' నాకెక్కడా కన్పించలేదు. ఆయన చాలా నిరాశ, నిస్పృహలతో వున్నారు. ఏ కేసులోనైనా ఏ విషయంలోనైనా తప్పించుకు తిరిగే ధోరణినే అనుసరిస్తున్నారు. బ్యాంకులు లేదా గ్రామీణ ప్రాంతాల దుస్థితి వంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా కన్పిస్తుంటే వాటిని గురించి పట్టించుకున్న పాపన పోలేదు. అసలు ఆయన ఈ సమస్యల గురించి ఆందోళన చెందాలి. 'మేం రాజ్యాంగాన్ని తిరగరాస్తాం' అన్నది భారీ ప్రాజెక్టు. గతంలో ఈ మాటలు ఎవరు చెప్పారో తల్చుకుంటే ఆశ్యర్యం వేస్తుంది. ఇదే మాటలను ముస్సోలిని, తరువాత హిట్లర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరెప్పుడు కోరితే అప్పుడు అందిస్తాను.