Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- నిర్మాణ కార్మికుల సంక్షేమం విస్మరించడంపై ఆగ్రహం
- రూ. 37,000 కోట్లు కార్మికులకు చేరలేదు: సర్వోన్నత న్యాయస్థానం
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
'నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలను మీరు(కేంద్రం) అమలు చేయడం లేదు. మా(సుప్రీంకోర్టు) ఆదేశాలు చెత్తబుట్టలో పడేస్తున్నాం.. కాబట్టి ఇకపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయకండి అని ముందుకు వచ్చి అధికారికంగా చెప్పొచ్చు కదా' ఇది కేంద్ర ప్రభుత్వనుద్దేశించి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు.
కార్మికుల పేర రియల్ఎస్టేట్ సంస్థల నుంచి రూ. 37 వేల కోట్ల సెస్ వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం... వారి సంక్షేమం కోసం ఖర్చు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం రూపొందించిన నియమాలను కేంద్ర సర్కారు అమలు చేయడం లేదని మండిపడింది. కార్మికుల ప్రయోజనాలకు చేరనప్పుడు 1996 చట్టం కింద రూ. 37,000 కోట్ల రూపాయాల సెస్ ఎందుకు వసూలు చేశారని ప్రశ్నించింది. 'ఇది పూర్తిగా నిస్సహాయ పరిస్థితి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా లేదని స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ఎవరి పేరు మీద(కార్మికుల) డబ్బులు వసూలు చేశారో క్షేత్రస్థాయిలో వాళ్లకు అవి చేరడం లేదు' అని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. భవంతి ఇతర నిర్మాణ కార్మికుల చట్టం-1996 ఎక్కడా అమలు జరగడం లేదని కేంద్ర సర్కారు తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటరీ జనరల్ మణీందర్సింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
నేషనల్ క్యాంపెయిన్ ఫర్ సెంట్రల్ లెజిస్లెషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ శనివారం విచారణకు వచ్చింది. కేసు విచారణ సందర్భంగా కార్మికులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ద్విసభ్య ధర్మాసనం తుర్పారపట్టింది. పైగా 'భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన రూ.37 వేల కోట్ల నిధులను ల్యాప్టాప్, వాషింగ్ మిషన్ల కొనుగోలుకు వినియోగించారని కాగ్ ఇటీవల సమర్పించిన తన అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది' అని ధర్మాసనం పేర్కొంది. అయితే రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక శాఖ కార్యదర్శులతో ఏర్పాటైన పర్యవేక్షక కమిటీ సమావేశం ఇటీవల జరిగిందని కేంద్ర సర్కారు తరఫు న్యాయవాది మణీందర్సింగ్ చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. 'ఆ సమావేశ మినిట్స్ ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేస్తున్నాయి' అని జస్టిస్ మదన్ బి లోకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కొలిన్ గొన్సాల్వేస్ స్పందిస్తూ.. ఆ సమావేశం కేవలం రెండు గంటల్లో ముగిసిందని, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. పిటిషనర్ న్యాయవాది లేవనెత్తిన అంశంతో ధర్మాసనం ఏకీభవిస్తూ.. 'సమావేశం నుంచి మొదలు మినిట్స్ వరకు.. చట్టాన్ని అమలు చేయలేరని స్పష్టంగా అర్థమవుతోంది' అని వ్యాఖ్యానించారు.