Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన కలిగిస్తున్న వేతనాలు : నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక
దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలో పనిచేసే కార్మికులవేతనాలు గణనీయంగా పడిపోతున్నాయి. దేశానికి అన్నంపెట్టే రైతన్నలు అర్థాకలితో బతుకీడుస్తున్నారు. ఇది స్వచ్ఛందసంస్థలు చేసిన అధ్యయనాలు కావు. మోడీ సర్కారు చేయించిన సర్వేలోనే వెల్లడైన వాస్తవ గ్రామీణం.
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంలో విత్తనాల నాటడంలో పనిచేసే కార్మికుల వేతనాల్లో వ్యత్యాసాలను గమనిస్తే ... 2016 నవంబర్ నాటికీ (6.1 శాతం నుంచి), గత ఏడాది నవంబర్ నాటికీ (4.8 శాతానికి) పల్లె సీమల్లో గ్రామీణ కార్మికుల వేతనాలు తగ్గిపోయినట్టు నేషనల్ శాంపిల్ సర్వే (కేంద్ర కార్మిక, ఉపాధి వ్యవహారాల మంత్వ్రిత్వ శాఖ అనుబంధ లేబర్ బ్యూరో తరఫున సేకరించిన వివరాల) నివేదిక తెలియజేసింది. ఈ కార్మిక శక్తి ప్రధానంగా వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలోని 25 రకాల వృత్తుల్లో పనిచేస్తూ జీవనోపాధిని పొందుతూ ఉంటాయి. వారి వేతనాల స్థితిగతులను అధ్యయనం చేసిన ఈ సంస్థ పరిశీలనలో వేతనాలు తగ్గిపోవడంతో వారి వినిమయ లేక కొనుగోలు శక్తి దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. గ్రామీణుల జీవన స్థితి గతులు దుర్భరంగా మారుతున్నాయని తెలియజేసింది.
జనవరి 2017 నాటికి రబీ పంట కాలంలో సాగు విస్తీర్ణం 614 లక్షల హెక్టార్ల నుంచి (అంతకు ముందు రబీ కాలంతో పోలిస్తే) 609 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. 2017 నవంబర్లో విత్తనాల నాట్ల సమయంలో ఒక వ్యవసాయ ఆడ కూలీ రోజువారీ సగటు వేతనం రూ. 225.22 మాత్రమే. అంటే అంతకు ముందు కాలంతో పోలిస్తే కేవలం 2.97 శాతం మాత్రమే ఎక్కువ. తోటల పెంపకంలో కూడా ఇదే విధంగా గత నవంబర్ నాటి వేతనాలతో పోలిస్తే 5.1 శాతం మాత్రమే పెరిగిందని నివేదిక తెలియజేస్తోంది. ఈ వివరాలను 20 రాష్ట్రాలలోని 600 గ్రామాల నుంచి 25 రంగాలకు సంబంధించిన వివరాలను సేకరించి అధ్యయనం చేశారు. వాటిలో 12 వ్యవసాయ రంగానికి సంబంధించినవి కాగా, 13 వ్యవసాయేతర రంగాలకు సంబంధించినవి.