Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట నిప్పంటించుకున్న దళితుడి మృతి..
అహ్మదాబాద్: గుజరాత్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడిన గుజరాత్ దళిత కార్యకర్త భానుభారు వాంకర్ మృతి చెందాడు. తన వర్గానికి న్యాయంగా దక్కాల్సిన భూమిని ఇవ్వాలని ఆయన కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో భానుభారు పటాన్ జిల్లా కలెక్టరేట్ ముందు పోలీసులు చూస్తుండగానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోవటంతో..గుజరాత్ భగ్గుమన్నది. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దళిత నాయకులు,సంఘాలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.
దళితఎమ్మెల్యేపై ఖాకీ జులుం
దళిత ఉద్యమ నేత, ఎమ్మెల్యే జిగేశ్ మేవానిపై గుజరాత్ ఖాకీలు జులుం ప్రదర్శించారు. కారులో ఉన్న జిగేశ్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అతని కారు తాళాలు కూడా విరగొట్టారు. దీంతో గుజరాత్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దళిత ఉద్యమ కార్యకర్త భానుభారు వాంకర్ బలిదానానికి సంతాపంగా సారంగపూర్లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద సంస్మరణ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వాంకర్ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.ఇందులో పాల్గొనటానికి జిగేశ్ తన అనుచరులతో కలిసి సారంగపూర్ బయలుదేరారు. ర్యాలీగా వస్తున్న జిగేశ్ను పోలీసులు ఆపారు. ఆయన్ని కారులోంచి పోలీసులు లాగేశారు. ఆపై కారు తాళాలను బద్ధలు కొట్టి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విషయం దావానంలా వ్యాపించింది.దళిత సంఘనేతలంతా ఆందోళనకు పూనుకోవటంతో..పోలీసులు జిగేశ్ను సారంగపూర్ వెళ్లటానికి అనుమతించారు.