Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2017-18 మొదటి త్రైమాసంలో..సంఘటిత రంగం అస్తవ్యస్తం
- తయారీ రంగంలో 87,000, రవాణా రంగంలో 3,000 ఉద్యోగాలకు కోత :
లేబర్బ్యూరో నివేదిక
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్లరద్దు నిర్ణయం సంఘటిత రంగంపైనా తీవ్ర ప్రభావం చూపినట్టు అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని 80 శాతం ప్రయివేట్ ఉద్యోగాలను కల్పిస్తున్న సంఘటిత రంగంలో 2017 ఏప్రిల్-జూన్ త్రైమాసంలో నూతన ఉద్యోగాల సృష్టి బాగా నెమ్మదించినట్టు లేబర్బ్యూరో నివేదిక వెల్లడించింది. ఈ త్రైమాసంలో మొత్తమ్మీద 64,000 కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్టు నివేదిక పేర్కొన్నది. ఇది అంతకుముందు త్రైమాసం(జనవరి- మార్చి)కన్నా 65 శాతం తక్కువ. జనవరి-మార్చిలో 1,85,000 నూతన ఉద్యోగాల సృష్టి జరిగింది. 2016 ఏప్రిల్-జూన్తో పోల్చినా ఉద్యోగాల కల్పన తక్కువే కావడం గమనార్హం. 2016లో ఇదే కాలానికి 77,000 నూతన ఉద్యోగాల కల్పన జరిగింది. సంఘటిత రంగంలో 81 శాతం వాటా ఉన్న 8 రంగాల్లో లేబర్ బ్యూరో నివేదిక ఇచ్చింది. ఈ 8 రంగాల్లో ప్రతి కంపెనీ కనిష్టంగా కనీసం 10మందికైనా ఉద్యోగాలు కల్పిస్తాయి.
గతేడాది ఏప్రిల్-జూన్లో ఎక్కువగా నష్టపో యింది తయారీ రంగమేనని నివేదిక తెలిపింది. ఈ కాలంలో ఈ రంగం కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగుల్లోనే 87000మందికి ఉద్వాసన పలికింది. అంతకుముందు త్రైమాసం (జనవరి-మార్చి)లో ఈ రంగం 1,02,000 నూతన ఉద్యోగాలు కల్పించింది. ఏప్రిల్-జూన్లో రవాణా రంగంలో 3000 ఉద్యోగాలకు కోత పడగా, అంతకుముందు త్రైమాసంలో 3000 ఉద్యోగాలు కల్పించింది. ఏప్రిల్-జూన్లో వాణిజ్యం,ఐటీ-బీపీవో రంగాల్లోనూ ఉద్యోగాల కల్పన నెమ్మదించింది.
ఇదే కాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కల్పన, దినసరి కార్మికుల ఉపాధి కూడా బాగా దెబ్బతిన్నట్టు అధికారిక అంచనా. 64,000 కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ కాలంలో కోత పడింది.
ఇదే త్రైమాసంలో 2016లో కోత పడిన 48,000కన్నా ఇది అధికం. కాంట్రాక్ట్, దినసరి,కాజువల్ కార్మికులు ఎక్కువగా ఉపాధి కోల్పోయింది కూడా తయారీ రంగంలోనేనని లేబర్బ్యూరో తెలిపింది. సాంకేతికంగా వచ్చిన మార్పుల వల్ల నైపుణ్య కార్మికుల అవసరం పెరుగుతున్నదని.. దాంతో, స్వల్ప నైపుణ్య కార్మికులు ఉపాధి కోల్పోతున్నారంటూ కేంద్ర గణాంకశాఖ మాజీ చీఫ్, ఇంటర్నేషనల్ గ్రోత్ సెంటర్(ఐజీసీ) డైరెక్టర్ ప్రొనబ్సేన్ విశ్లేషించారు.