Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులకు రూ.800 కోట్ల ఎగవేత..!!
- రొటొమాక్ పెన్నుల కంపెనీ అధినేత పరార్..!!!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను బడాబాబులు కావాల్సినంతగా దండుకున్నారన్న కఠోరవాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం మరవకముందే అచ్చం అలాంటి మరో మోసం వెలుగు చూసింది. పీఎన్బీకి చెందిన ముంబయి శాఖను రూ.11,400 కోట్లకు ముంచిన వజ్రాల వ్యాపారి నీరవ్మోడీ ఆ కుంభకోణం బయటపడేలోగా విదేశాలకు చెక్కేసిన విషయం తెలిసిందే. తాజాగా పలు ప్రభుత్వరంగ బ్యాంకులను వందల కోట్లకు ముంచిన మరో కుంభకోణం బయటపడింది. ప్రముఖ రొటొమాక్ పెన్నుల కంపెనీ మాతృసంస్థ దేశంలోని పలు బ్యాంకుల్లో రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్టు తెలిసింది. రొటొమాక్ కంపెనీ యజమాని అయిన విక్రమ్ కొఠారి ఐదు బ్యాంకుల్లో రూ.800 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాడని అధికారవర్గాలు చెబుతున్నాయి. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పలు నియమాలను ఉల్లంఘించి కొఠారీకి అప్పులు ఇచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. యూనియన్ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ నుంచి రూ.352 కోట్ల కొఠారి రుణం తీసుకున్నారు. అయితే, ఆయన ఇప్పటివరకూ అసలు కానీ, వడ్డీని కానీ బ్యాంకులకు తిరిగి చెల్లించలేదని ఆయా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాన్పూరులోని సిటీ సెంటర్ రోడ్లులోని కొఠారి కార్యాలయానికి కొన్ని వారాలుగా తాళం వేసి ఉన్నది. ఆయన కనిపించకపోవడంతో విదేశాలకు పరారై ఉంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై అలహాబాద్ బ్యాంకు మేనేజర్ రాజేశ్గుప్తా స్పంది స్తూ.. కొఠారి ఆస్తులు అమ్మైనా సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపు తోంది. ఇప్పుడు ఈ రొటొమాక్ కుంభకోణంపై బ్యాంక్ వర్గాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.