Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో యాసిడ్ దాడి బాధితురాలిపై మరో బీజేపీ నేత...
ఈటానగర్ /భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండూ తనపై లైంగికదాడికి పాల్పడినట్టు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)కు ఒక మహిళ ఫిర్యాదు చేసింది. 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన తరఫు న్యాయవాదితో కలసి వచ్చిన ఆమె ఎన్సీడబ్ల్యూకు ఈ ఫిర్యాదు అందచేసిది. 'పేమా ఖండూపై నా క్లయింట్ లైంగికదాడి కేసు నమోదుచేసింది. ఆమెపై లైంగికదాడి జరిగినప్పుడు ఖండూ సీఎం పదవిలో లేరు. ఇది 2008 నాటి సంఘటన. పోలీసులు, కోర్టును ఆమె సంప్రదించింది. కానీ, ఎవరూ తన ఫిర్యాదును నమోదుచేసుకోలేదు. మహిళా కమిషన్కు తన ఫిర్యాదును అందచేసింది' అని బాధితురాలి తరఫు న్యాయవాది రేష్మి భట్టి మీడియాకు తెలిపారు. 'ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తానని ఆమెను సర్క్యూట్ హౌస్కు తీసుకెళ్ళారు. అక్కడ ఆమెకు డ్రగ్స్ ఇచ్చి.. సృహ కోల్పోయిన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు' అని భట్టీ చెప్పారు. ఆ ఘటన తర్వాత ఆమె చాలా భయపడిందనీ, అందుకే విషయం బయటకు చెప్పలేదని అన్నారు. 'ఆర్మీ అధికారినంటూ ఆమెతో ఖండూ పరిచయం పెంచుకున్నాడు... ఉద్యోగం ఇప్పిస్తాంటే ఆమె అక్కడకు వెళ్ళింది' అని న్యాయవాది రేష్మి భట్టి చెప్పారు. 2011లో ఖండూ ఫొటోను వార్తాపత్రికల్లో చూసిన బాధితురాలు అతడిని గుర్తించిందని అన్నారు. 'ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీసుల వద్దకు వెళ్ళింది. కానీ, ఫిర్యాదు నమోదుచేసుకోలేదు. ఆ తర్వాత చంపేస్తామంటూ బెదిరింపులు రావడం మొదలయ్యాయి. దీంతో ఆమె వెనక్కు తగ్గింది' అని భట్టీ తెలిపారు.
బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు
మధ్యప్రదేశ్లో బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సాత్నా జిల్లాకు చెందిన 25 ఏండ్ల యాసిడ్ దాడి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 'మధ్యప్రదేశ్ ప్రభుత్వ రాజ్య సిలై కళా మండల్' వైస్ చైర్మెన్గా వ్యవహరిస్తున్న రాజేంద్ర నాందేవ్ రాష్ట్ర సహాయ మంత్రి హోదా అనుభవిస్తున్నాడు. ముఖ్యమంత్రి నుంచి ఆర్థిక సహాయం అందేలా చేస్తానని.. ఇందుకు సంబంధించి మాట్లాడేందుకు భోపాల్ రైల్వే స్టేషన్కు సమీపంలోని ఓ హోటల్కు రావాల్సిందిగా మూడు నెలల క్రితం తనను పిలిచాడనీ, అక్కడకు వెళ్ళిన తనపై లైంగికదాడికి ప్రయత్నించాడని బాధితురాలు హనుమాన్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఆమె తప్పించుకొని బయటపడిందని పోలీసు అడిషనల్ సూపరింటెండెంట్ రాజేశ్ సింగ్ బదారియా చెప్పారు.
'భారతీయ శిక్ష్మాస్కృతిలోని సంబంధిత సెక్షన్ల కింద రాజేంద్ర నాందేవ్పై కేసు నమోదుచేశాం. అతడిని విచారిస్తున్నాం' అని రాజేశ్ సింగ్ తెలిపారు. కాగా, రాజేంద్ర నామ్దేవ్పై కేసు నమోదు కావడంతో... 'రాజ్య సిలై కళా మండల్' వైస్ చైర్మెన్ పదవి నుంచి అతనిని తొలగిస్తున్నట్టుగా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు.