Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రసంగం వినేందుకు దళిత విద్యార్థులను గుర్రాలశాలలో కూర్చోపెట్టారు
- మధ్యాహ్న భోజనంలోనూ వేరుగానే : విద్యార్థులు
- బీజేపీ పాలిత హిమాచల్ ప్రదేశ్లో వివక్ష వెలుగులోకి
సిమ్లా : ప్రధాని నరేంద్రమోడీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన దళిత విద్యార్థులను గుర్రాల చావడిలో కూర్చోబెట్టిన ఘటన బీజేపీ పాలిత హిమాచల్ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో... చెప్పేందుకు ఇటీవల ప్రధాని మోడీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు హిమాచల్ప్రదేశ్లోని కులులోని ఒక గ్రామ పంచాయితీ సహకారంతో పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా టీవీని ఏర్పాటుచేశారు. ప్రధాని మోడీ ప్రసంగం కదా అని విద్యార్థులందరూ టీవీ ఉన్న గదికి పరుగులు తీశారు. కాగా, అందులో దళిత విద్యార్థులను మాత్రం టీవీ ఉన్న గదిలోకి వెళ్ళనివ్వలేదు. వారిని పక్కనే ఉన్న గుర్రాలు కట్టేసే స్థలంలో కూర్చోబెట్టి ఆయన ప్రసంగాన్ని వినమని ఉపాధ్యాయులు ఆదేశించారు. కులులోని చెస్తా గ్రామంలో ఈ వివక్ష ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి వివక్షనే తరుచుగా ఎదుర్కొంటున్నామంటూ డిప్యూటి కమిషనర్ యూనస్కు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మధ్యాహ్న భోజనంలోనూ...
మధ్యాహ్న భోజన సమయంలోనూ తమను వేరుగా కూర్చోబెడుతున్నారని దళిత విద్యార్థులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుడు రాజన్ భరద్వాజ్ కూడా కుల వివక్షను పాటిస్తాడని ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటన మా దృష్టికి వచ్చిందని, వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యా కార్యదర్శికి ఆదేశించామని రాష్ట్ర విద్యా శాఖమంత్రి సురేశ్ భరద్వాజ్ తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపై ఇదివరకే తన దృష్టికి వచ్చిందన్నారు. తాజా ఫిర్యాదు నేపథ్యంలో ఘటనపై విచారించి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.