Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాల కల్పన అంటూ ఆశ
- నిరుద్యోగులకు మొండిచెయ్యి
- కోటి ఉద్యోగాల మ్యానిఫెస్టో ఏమైంది?
- 4 కోట్లమంది నిరుద్యోగులు నమోదు చేసుకోగా, 8 లక్షలే ఖాళీలు
- ఉద్యోగాలెన్నిచ్చారంటే ముఖం చాటేశారు
నవతెలంగాణ జనరల్డెస్క్
ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దేశంలోని యువతలో ఆశలు రేకిస్తూ 2015 జులైలో నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) పేరుతో జాబ్ పోర్టల్ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఈ జాబ్ పోర్టల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులు కేవలం ఏయే సంస్థలు తమ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటీసులు జారీ చేశాయి, అందుకు వారు అడుగుతున్న అర్హతలేమిటి తదితర వివరాలను మాత్రమే పొందుతున్నారు. అంతేతప్ప ఈ పోర్టల్ ద్వారా నిరుద్యోగులకు నేరుగా ఉద్యోగాలేమీ కల్పించడం లేదన్నది గమనార్హం. ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను ఈ పోర్టల్ ద్వారా తెలియజేస్తున్నారు.
మూడున్నరేండ్లలో ఈ పోర్టల్లో 4 కోట్లమంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకోగా, 8 లక్షల ఉద్యోగాల ఖాళీలు, వాటి భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలను అందించారు. అంటే ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నవారికి అన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారన్నది కాదు. ఖాళీలు,రిక్రూట్మెంట్ విధానాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఇచ్చారని అర్థం. అంటే పోర్టల్ ద్వారా ఉద్యోగాలు కోరినవారిలో 2 శాతంమందికి మాత్రమే ఫలానా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి, ప్రయత్నించండి అంటూ సూచించారన్నమాట.
అయితే, మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టకముందే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ, యూనివర్సిటీల్లోనూ ఎంప్లారుమెంట్ ఎక్చేంజీలున్నాయి. వాటిలో పేర్లు నమోదు చేసుకున్నవారికి వారి అర్హతలు, అనుభవం ఆధారంగా ఏ ఉద్యోగాలకు అవకాశముంటుందో సలహాలు ఇచ్చేందుకు ఆ ఎక్చేంజ్ల్లోనే గైడెన్స్ సెల్స్ ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం దేశంలో అటువంటి ఎక్చేంజ్లు, గైడెన్స్్ సెల్స్్ 978 ఉన్నాయి. వీటి మధ్య అనుసంధానం కోసం గతంలో నేషనల్ ఎంప్లారుమెంట్ సర్వీస్(ఎన్ఈఎస్) పేరుతో నెట్వర్క్ ఉండేది.
ఎన్ఈఎస్ స్థానంలో మోడీ ప్రభుత్వం ఎన్సీఎస్ను ఏర్పాటు చేసింది. దీంతో, నిరుద్యోగులకు ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వమేమీ ఇలాంటి కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టిందేమీ లేదన్నది గమనార్హం. నిరుద్యోగ యువతకు వారి అర్హతకు తగిన ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఈ ఉచిత సలహాల వల్ల ఉపయోగమేమిటన్నదే ప్రశ్న..
ఇదే అంశంపై ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి సంతోష్గ్యాంగ్వార్ సమాధానమిస్తూ ఎన్సీఎస్ వివరాలను వెల్లడించారు. 2017,డిసెంబర్ 31వరకు ఎన్సీఎస్ పోర్టల్లో 3.94 కోట్లమంది నిరుద్యోగులు నమోదు చేసుకోగా, 8లక్షల 9 వేల ఉద్యోగ ఖాళీల గురించి వారికి తెలియజేశామని మంత్రి తెలిపారు. పోర్టల్ ప్రారంభించిన తర్వాత 2016 మార్చి చివరి వరకూ 45911, 2016-17లో 5.17 లక్షలు, 2017-18లో 2.45 లక్షల ఖాళీల గురించి తెలిపినట్టు మంత్రి వివరించారు. అయితే, పోర్టల్లో నమోదైన నిరుద్యోగుల్లో ఎంతమందికి ఉద్యోగా లొచ్చాయన్న ప్రశ్నకు మంత్రి నుంచి సమాధానం రాలేదు. ఎన్సీఎస్ పోర్టల్లో ఉద్యోగాల కోసం పెద్దసంఖ్యలో యువకులు నమోదు చేసుకోవడంపై రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త మాట్లాడుతూ..ఆశించినవారిలో కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు పొందగలుగుతున్నారని, సంఘటిత రంగంలో డిమాండ్ మేరకు ఉద్యోగాలు కల్పించలేని స్థితి ఉన్నదని అన్నారు. వాస్తవానికి ఎన్సీఎస్లో నమోదు చేసుకున్నదానికన్నా రెట్టింపు సంఖ్యలో విద్యావంతులైన నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి కోసం ఆరాటపడుతున్నారు. ఆందోళనతో ఉన్నారు.