Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ ఖండన
జైపూర్:రాజస్థాన్లో రైతు నేతలు, కార్యకర్తల అరెస్ట్ను అఖిలభారత కిసాన్ సభ(ఏఐకేఎస్) ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ నెల 22న జైపూర్లో ప్రారంభం కానున్న నిరవధిక మహాధర్నా(మహా పడావ్)కు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న రైతు సంఘాల కార్యకర్తలను అక్కడి బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు ఏఐకేఎస్ తెలిపింది. అరెస్టయినవారిలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు అమ్రారామ్, సీనియర్ నేతలు హేతురామ్బేనీవాల్, ష్యోపట్ మేఫ్ువాల్, ఇంకా ఇతరులు ఉన్నారు.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రైతు ఆందోళనకు తలొగ్గి రుణమాఫీ, ధాన్యం సేకరణ, కనీస మద్దతుధర, పింఛన్లుసహా పలు డిమాండ్లకు అంగీకరించిన వసుంధరరాజే ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా వెనక్కి తగ్గిందని ఏఐకేఎస్ విమర్శించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు ఏఐకేఎస్ తెలిపింది. బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా మహాధర్నా జరిపి తీరుతామని ఏఐకేఎస్ స్పష్టం చేసింది. రైతులు, వ్యవసాయ కార్మికులు హాజరయ్యే మహాధర్నాలో ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ధవాలే, సంయుక్త కార్యదర్శి విజూకృష్ణన్ పాల్గొంటారని ఏఐకేఎస్ తెలిపింది. రైతులు సంఘటితం కావడంతో బీజేపీ ప్రభుత్వానికి వణుకు పుట్టిందని ఏఐకేఎస్ దుయ్యబట్టింది. అణచివేత ద్వారా ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని ఏఐకేఎస్ స్పష్టం చేసింది. రైతులు, కార్మికులు, పేదల వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ విధానాలను ఓడించే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించింది.