Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది మన హక్కు
- రాష్ట్రానికి ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్
- ప్రజాగ్రహమే కారణమా?
అమరావతి : 'ప్రత్యేకహోదా ప్రతిపత్తిని మిగతా రాష్ట్రాలకు కొనసాగిస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు? వేరే రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు మాకూ అదే పేరుతో ఇవ్వాల్సిందే' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమా వేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య ఆ పార్టీ శ్రేణులతో పాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. వాస్తవానికి కొద్దిరోజుల కిందటి వరకు చంద్రబాబు దీనికి పూర్తిభిన్నంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఒక దశలో 'హోదా ఏమన్నా సంజీవనా? అన్ని సమస్యలను అది పరిష్కరి స్తుందా?' అని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు కూడా అన్ని స్థాయిల్లోనూ ఇదే వాదన వినిపించారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆ పార్టీ వైఖరి మారడం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రత్యేకహోదాకు అనుకూలంగా ప్రజానీకంలో పెద్దఎత్తున వ్యక్తమవు తున్న స్పందనే దీనికి కారణం. ఇటీవల వామపక్షాలు నిర్వహించిన బంద్ పిలుపునకు అనూహ్యమైన స్పందన రావడం, భారీ ఎత్తున విజయవంతం కావడం టీడీపీి నాయకత్వంలో చర్చనీయాంశంగా మారింది. ఇంటిలిజెన్స్తో పాటు ఇతర వర్గాల నివేదికలూ ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. ఒకటి,రెండు రోజుల్లో ప్రజా ఆగ్రహం చల్లబడిపోతుందని తొలుత టీడీపీ నాయకులు అంచనా వేసినట్లు తెలిసింది. ఈ కారణంగానే వామపక్షాల బంద్ తరువాత కూడా ముఖ్యమంత్రి, ఇతర టీడీపీి నాయకులు ప్రత్యేక ప్యాకేజికి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. 'హోదాకు సమానంగా ప్యాకేజి' అన్న అంశాన్ని ప్రచారంలో పెట్టడానికి ప్రయత్నించారు. అయితే, రోజులు గడుస్తున్నా ప్రజా గ్రహం ఏమాత్రం తగ్గడం లేదని స్పష్టమైంది. హోదా, విభజన హామీల అమలు సాధనే లక్ష్యంగా వివిధ పార్టీలు, సంఘాలు ఇప్పటికే ప్రకటించిన కార్యక్రమాలకు అన్ని జిల్లాలో సానుకూల స్పందన వ్యక్తమవు తోందంటూ నిఘా వర్గాలు తాజాగా నివేదించాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. కొందరు రాష్ట్ర మంత్రులు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఒకరిద్దరు మంత్రులు బీజేపీితో తెగతెంపులు చేసుకోవడమే మేలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడి స్వరం కూడా మారుతున్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం జరిగిన సభలో 'కాంగ్రెస్ మాదిరే బీజేపీ కూడా మోసం చేసింది. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం' అని వ్యాఖ్యానించిన ఆయన తాజాగా ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.