Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీడెన్ ప్రభుత్వం అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని తయారీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుందని స్వీడెన్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఒక సర్వే నిర్ధారించింది. ఈ రంగంలో పని చేసే కార్మికులలో మహిళల వాటా కేవలం 3 శాతం నుంచి 12 శాతం లోపునే ఉంటున్నట్టు ఈ సర్వే నిర్ధారించింది. వివిధ రంగాలకు చెందిన 25 కంపెనీల ఉద్యోగులతో నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఈ విషయం స్పష్టమైంది. సర్వీసు రంగాలలో మాత్రం మహిళలు ఎక్కువగానే రాణిస్తున్నారు. ఈ రంగాలలో సుమారు 27 శాతం నుంచి 40 శాతం వరకు మహిళలను నియమిస్తున్నట్టు స్పష్టమైంది. అసలు నిజం ఏమిటంటే తయారీ రంగంలో మహిళలకు ఉన్న ఉపాధి అవకాశాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవడమే కారణమని ఈ సర్వే నిర్వాహకులు వెల్లడించారు. ఈ విషయంలో వారిని చైతన్యవంతం చేసేందుకు క్రాఫ్ట్స్ మేళాలను విస్తృతంగా నిర్వహించాలని వారు సూచించారు. ఇలాంటి మేళాలను మన దేశంలోని స్వీడిష్ చాంబర్ ఆఫ్ కామర్స్ విభాగం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అన్ని రంగాలకు చెందిన వారిలో అట్టడుగు వర్గాల వారిని ఎంపిక చేసుకుని వారి వృత్తి నైపుణ్యాలకు మెరుగు పెట్టాలని ఆలోచిస్తున్నట్టు స్వీడెన్ కౌన్సెల్ జనరల్ వుల్రికా సుండ్బర్గ్ తెలిపారు. తయారీ రంగం ద్వారా తయారయ్యే కొన్ని ఉత్పాదనల వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. డ్రిల్లింగ్ మెషీన్లు, వాటర్ ఫిల్టర్లు, తయారీ యంత్రాలు ఉత్పత్తి చేసే రంగాలలో మహిళలకు మంచి అవకాశాలున్నట్టు ఆయన చెప్పారు. సేవా రంగాలలో డిజిటల్ సొల్యూషన్స్, లాజిస్టిక్స్లో డిజిటల్ సేవలు, నిధుల నిర్వహణ, కమ్యూనికేషన్స్, ఉపాధి కల్పన వంటి రంగాలలో సాధారణ నైపుణ్యాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి ఆశించే వారి సంఖ్యల్లో చాలా వ్యత్యాసాలున్నాయని అంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నించిన విద్యావంతులైన మహిళలు 2007లో 39 శాతం ఉండగా 2014 నాటికి ఆ అంకె 49 శాతానికి చేరిందని, అయితే వారిలో అందరూ ఉపాది మార్కెట్లోకి రావటం లేదని ఆయన తెలిపారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చదువుతున్న వారు 12 శాతం చేరుతున్నప్పటికీ కీలకమైన ఇంజినీరింగ్ రంగాలలో ప్రవేశించేవారు 3 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. కేవలం సగం సంస్థల్లో మాత్రమే మహిళలకు ఉన్నత పదవులు దక్కుతున్నాయని, ఫలితంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే వారు లేకుండా పోతున్నారని ఆయన చెప్పారు. ఏ కొద్ది మంది అయినా ఉన్నత పదవులకు చేరువైనా గర్భధారణ అనంతరం చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరడం లేదని సహ అధ్యయనవేత్త సారా లార్సన్ గుర్తుచేశారు. అంటే మహిళలను ఉద్యోగాలనుంచి జారిపోకుండా కాపాడుకోవటం చాలా అవసరమని, అందుకోసం మహిళలకు ప్రత్యేకంగా మాతృత్వపు సెలవులు మంజూరు చేయటంపై యాజమాన్యాలు గ్రహించాలని సూచించారు. పురుషులతో సమానంగా కెరీర్ పెంచుకునేందుకు అసౌకర్యవంతమైన పనివేళల్లో పనిచేసేందుకు కూడా కొంత మంది సిద్ధమవుతున్నా వాళ్లకి ఇచ్చే వేతనాల్లో వ్యత్యాసాలు కారణంగా చాలా మంది ముందుకు రావటం లేదని మానవ వనరుల అధికారులు తెలిపారు.