Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 6 లక్షల మంది నవజాత శిశువుల మృతి
- యూనిసెఫ్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : ఏడాదికి ఆరు లక్షల మంది చిన్నారులకు పుట్టిన 28 రోజులకే నూరేండ్లూ నిండుతున్నాయి. నవజాత శిశు మరణాల సంఖ్య ప్రపంచంలోనే మన దేశంలో అత్యధికంగా ఉన్నట్టు యునిసెఫ్ తాజా అధ్యయనం వెల్లడించింది. వీటిలో ఎక్కువ భాగం మరణాలు నివారించేవి, వైద్యపరం గా చికిత్స చేయగలిగినవేనని గుర్తించింది. ఈ మరణాల్లో 80శాతం ఎటువంటి తీవ్రమైన కారణాలతో సంభవించినవి కాదని స్పష్టం చేసింది. కాగా... దేశంలో ఐదేండ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు తగ్గిందని ఆ అధ్యయనం పేర్కొంది. ''దేశంలో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రతి ఏడాదీ చనిపోతున్న శిశువుల సంఖ్య ఆమోద యోగ్యం కానిది. ప్రతి ఏడాదీ సుమారుగా 6,00,000 మంది నవజాత మరణాలు భారతదేశం లో సంభవిస్తున్నాయి'' అని యునిసెఫ్ తెలిపింది. ప్రసూతి మరణాలకు సంబంధించి 'ప్రతి చిన్నారీ బతకాలి' పేరుతో యునిసెఫ్ ఈ నివేదకను మంగళవారం విడుదల చేసింది. ప్రతి వెయ్యి జననాల్లో 24.4 మరణాల రేటుతో 184 దేశాల్లో భారత్ 31వ ర్యాంకు సాధించింది. శిశువుకు మొదటి 28 రోజులు చాలా దుర్భలమైన కాలం. పసికందుల్లో తొలి నెలలో అత్యధిక ప్రమాదం పొంచి వుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా నెలరోజుల లోపు చిన్నారుల్లో మరణాలరేటు ప్రతి వెయ్యిమందిలో 19గా నమోదైనట్టు నివేదిక తెలిపింది. 2016లో 2.6 మిలియన్ల మంది పుట్టిన నెల రోజుల్లోపు చనిపోయారనీ, అందులో వారం రోజుల వయస్సుగల చిన్నారులో ఎక్కువని యునిసెఫ్ నివేదిక పేర్కొంది. 'చనిపోయిన పసికందుల్లో.. 80 శాతం కంటే ఎక్కువ మంది చికిత్సచేయగలిగినవేనని, నెలలు నిండకుండానే పుట్టడం, డెలివరీ సమయంలో సమస్యలు, సెప్సిస్, న్యుమోనియా తదితర అంటువ్యాధులు సోకి మరణించారు' అని తెలిపింది. పరిశుభ్రమైన తాగునీరు, వైద్య సౌకర్యాలు, తల్లి, నవజాత శిశువుకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఉండాలి. డెలివరీ సమయలో ఒక మృత్తి నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్త, శిశువు జన్మించిన మొదటి గంటలోపు తల్లిపాలు తాగించడం తదితర చర్యలతో శిశుమరణాలను చాలా వరకు అరికట్టవచ్చునని స్పష్టం చేసింది. ''2030 నాటికి శిశు మరణాల రేటు 12కు తగ్గాలన్నది భారత్ లక్ష్యం. దానిని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న దానిని సగానికి సగం తగ్గించాలి. ఏదేమైనా.. ఐదేండ్లలోపు చిన్నారుల మరణాల తగ్గుదలలో మంచి పురోగతి ఉంది'' అని తెలిపింది.